భారత్ వేదికగా అక్టోబర్ ఐదు నుంచి వన్డే ప్రపంచ కప్( ODI World Cup ) ప్రారంభం అవనున్న సంగతి అందరికీ తెలిసిందే.భారతదేశంలోని 10 మైదానాలలో ఈ టోర్నీ మ్యాచ్లు జరగనున్నాయి.
ఐసీసీ( ICC ) ఇప్పటికే మ్యాచ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) వేదికగా మూడు మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ మూడు మ్యాచ్లలో భారత జట్టు ఆడే మ్యాచ్ లు లేకపోయినా పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్లు ఉన్నాయి.అక్టోబర్ 6న పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 9న నెదర్లాండ్స్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది.అక్టోబర్ 10 న పాకిస్తాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుంది.

అక్టోబర్ 9, 10 రోజులలో వరుసగా మ్యాచులు జరగడం వల్ల భద్రతా అంశాల పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీస్ విభాగం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association ) దృష్టికి తీసుకువెళ్ళింది.కనీసం ఒకరోజు గ్యాప్ లేకుండా వరుసగా రెండు రోజులు మ్యాచ్ల వల్ల భద్రతా కల్పించడం కష్టతరంగా మారుతుందని సూచించింది.హైదరాబాద్ నగర పోలీసు విభాగం విజ్ఞప్తిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ( BCCI ) దృష్టికి తీసుకెళ్లింది.9,10 తేదీలలో వరుసగా మ్యాచ్లు ఉండడం వల్ల భద్రత విషయంలో పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, మ్యాచ్ల మధ్య కనీసం ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్ ఉండేలా తేదీలను మార్చాలని బీసీసీఐ ని కోరింది.

కానీ బీసీసీఐ ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది.ఇప్పటికే ఒకసారి ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పులు చేయడం జరిగిందని, మరోసారి మ్యాచ్ల నిర్వహణ తేదీలు మార్చడం సాధ్యం కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పష్టం చేసింది.దీంతో చేసేదేమీ లేక 9,10 తేదీలలో జరిగే మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి భద్రత ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నగర పోలీస్ శాఖ దృష్టి సారించింది.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ల నిర్వహణ ఉంటుందని తెలిపారు.







