కరోనా సంక్షోభం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిపుణులు, కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి.ఇందుకు ఏ దేశం కూడా మినహాయింపు కాదు.
కోవిడ్ కారణంగా చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలను వదులుకుని స్వస్థలాలకు వెళ్లిపోయారు.ఇందుకు పలు నిబంధనలు కూడా కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.
అయితే ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టడంతో అన్ని చోట్లా ఆర్ధిక వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి.
కానీ ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో సరిపడినంత మానవ వనరులు లేకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి.ఇక్కడ నిరుద్యోగం 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది.
దాదాపు 4,80,000 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి.నిన్న మొన్నటి వరకు బ్రిటన్, భారత్, చైనా తదితర దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చేవారి సంఖ్య ఎక్కువగా వుండేది.
అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా విదేశీయులు ఆసీస్ గడ్డకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.దీని ప్రభావం వలసలపై పడింది.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో నిపుణులు, కార్మికుల కొరత తలెత్తింది.పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ఆ దేశ ప్రభుత్వం నష్ట నివారణా చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా శాశ్వత వలస హోదాను ఇవ్వాలని నిర్ణయించింది.2023 జూన్ 30తో ముగిసే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అదనంగా 35,000 మందికి శాశ్వత వలస హోదాను ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈ ఏడాది 1,95,000 మంది విదేశీయులు ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడేందుకు వెసులుబాటు కలుగుతుంది.
మరోవైపు దేశంలో కార్మికుల కొరత వుందని అంగీకరించారు ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్.ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నర్సుల కొరత తీవ్రంగా వుండటంతో… ఉన్న కొద్దిమంది కూడా రెండేళ్లుగా రోజుకు రెండు, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే విమానాశ్రయాల్లోనూ సిబ్బంది లేక ఆ రంగం సతమతమవుతున్నట్లు నీల్ చెప్పారు.
విదేశీయులు జర్మనీ, కెనడా, బ్రిటన్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని.ఇటువైపు రావడం లేదని నీల్ అన్నారు.
ఈ క్రమంలో ప్రతిభావంతులను ఆకర్షించడానికి శాశ్వత వలస వీసా విధానంలో మార్పులు అనివార్యమని హోంమంత్రి పేర్కొన్నారు.