ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా వైసిపి ,టిడిపి, జనసేన ( YCP, TDP, Jana Sena )లు ఉన్నాయి.వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి, జనసేన లు పోరాటాలు చేపడుతూ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఈ రెండు పార్టీలను మరింత బలహీనం చేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసిపి వ్యూహాలు రచిస్తోంది.
ఇలా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ రాజకీయం ముందుకు నడిపిస్తున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ పార్టీ నేతల్లోనూ చిత్త శుద్ధి లేదనే విషయం అనేక సందర్భాల్లో తేలింది.ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీకరణ విషయంలో ఈ మూడు పార్టీల చిత్త శుద్ధి పై స్టీల్ ప్లాంట్ కార్మికులు విసుగెత్తిపోయారు.
ఏపీకి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించడంతో పాటు, దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్న, ఏపీలోని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో దానిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ఈ విషయంలో వైసిపి, టిడిపి, జనసేన మూడు కేంద్ర అధికార పార్టీని ఈ విషయంలో నిలదీసే ప్రయత్నం చేయడం లేదనే ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.మొదట్లో దీనిపై మూడు పార్టీలు కాస్త హడావుడి చేసినా, కేంద్రంపై ఒత్తిడి చేసే విషయంలో ఎవరికి వారు మౌనంగా ఉండిపోయారు.ఈ విషయాన్ని గ్రహించిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ మూడు పార్టీలతో ఇక లాభం లేదని భావించి తెలంగాణ అధికార పార్టీ బీ ఆర్ ఎస్, అక్కడే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లను సంప్రదించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల విజ్ఞప్తి స్పందించిన బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి కేటీఆర్( Minister KTR ) విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దు అంటూ, కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ని కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని, పార్లమెంటులో తమ సమస్యను ప్రస్తావించాలంటూ కోరారు.

దీనిపైన రేవంత్ సానుకూలంగానే స్పందించారు.ఈ పరిణామాలను బట్టి చూస్తే ఏపీలో రాజకీయ పార్టీలు ఉన్నా… వాటి వల్ల ఉపయోగం లేదని, కేంద్రంపై గట్టిగా పోరాడుతున్న తెలంగాణ పార్టీలైన బిఆర్ఎస్ కాంగ్రెస్ తమకు ఎంతో కొంత న్యాయం చేయగలవని నమ్మకంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నట్టుగా అర్థం అవుతోంది.







