దేశంలో కమ్యునిస్టుల ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతోంది.ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పిన కమ్యునిస్టులు ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు.
సిద్దాంతాలు ఒక్కటే అయిన సీపీఐ, సీపీఎం.రెండూ వేర్వేరుగా ఉంటున్నాయి.
సొంతంగా పోటీ చేసే శక్తిలేక ఇతర ప్రధాన పార్టీలతో అంటకాగి తోక పార్టీలుగా మారుతున్నాయనే విమర్శ కూడా ఉంది.ఇక కమ్యునిస్టులు ప్రస్తుత రోజుల్లో వైఫల్యం చెందడానికి అనేక కారణాలున్నాయి.
నిజానికి కమ్యూనిజంలో నిజం ఉంది.పేదవారి కోసం పాటుపడాలన్న ఉద్దేశ్యంలో పరమార్ధం ఉంది.
వాటిని అలా సిద్ధాంతాలుగా పెట్టుకుంటూనే ఇంకా లోతుల్లోకి వెళ్లాలి.జనాలకు అర్ధమయ్యే భాషలో చెప్పాలి.ఈ దేశంలో సామ్యవాదం కోసం పోరాడిన వారిని జనం ముందు పెడితే వారికి అర్ధమవుతుంది.
ఉండాల్సిన వాదమే కానీ
నిజానికి ఏ రోజు అయినా పేదవాడు ఉంటాడు కాబట్టి కమ్యూనిజం ఎప్పుడూ ఉండాల్సిన వాదమే.దాంతో పాటు తమ సిద్ధాంతాలను భారతీయకరణ చేయడంలో కామ్రేడ్స్ బాగా వెనకబడ్డాయని అంటారు.ఇక ఒకే రకమైన భావజాలం ఉన్న సీపీఐ, సీపీఎం ఎందుకు కలసి పోటీ చేయవో అర్థం కాని పరిస్థితి.
ఈ రెండు పార్టీలు ఒక్కటిగా మారితే కొంతైనా బలపడే అవకాశాలు ఉంటాయి.దేశంలో చక్రం తిప్పిన కమ్యునిస్టులు ఇప్పుడు కేరళకు మాత్రమే పరిమితం అయ్యారు.అక్కడ కూడా సీపీఎం సర్కార్ మాత్రమే ఉంది.
ఇప్పుడు సాధ్యమా
అయితే కమ్యునిస్టులు ఉనికి కోసం పాట్లు పడుతున్న క్రమంలో బీజేపీని గద్దె దించాలని నినదిస్తున్నారు.విశాఖలో దాదాపుగా యాభై ఏళ్ల తరువాత జరిగిన సీపీఐ రాష్ట్ర మహా సభలకు పార్టీ జనాలు బాగానే వచ్చారు.సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ దేశంలో ప్రజాతంత్ర లౌకిక శక్తులు అన్నీ ఏకం కావాలని కోరారు.
అదే విధంగా బీజేపీని గద్దె దించకపోతే ఈ దేశం బాగుపడని కూడా అన్నారు.అంతా ఏకం కావాలని ప్రాంతీయ పార్టీలు కూడా ముందుకు రావాలని సీపీఐ అగ్రనాయకత్వం కోరుతోంది.
అయితే సీపీఐ ఈ రోజు ఉనికి కోసం పోరాటం చేస్తోంది.తన సిద్ధాంతాలను జనంలో పెట్టి మద్దతు పొందలేకపోతోంది.
పొత్తులతో కాలక్షేపం చేద్దామన్నా కొత్తగా పుట్టిన పార్టీలు కూడా దూరంగానే మసలుతున్నాయి.మరి లోపం ఎక్కడ ఉందో తెలుసుకోకుండా ఢిల్లీ కోటను బద్ధలు కొడతామన్న పెద్ద మాటలతో పొద్దు పుచ్చితే కమ్యూనిజానికి రాణింపు ఉంటుందా.? అన్నదే ప్రశ్నగా మారింది.
అయితే ఇప్పటికీ కామ్రేడ్స్ కి ఎంతో ఆశాభావం ఉంటుంది.వారికి ఉన్న ఆశ ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువే.కానీ కాలాలు మారుతున్నాయి.
తాము కూడా మారి జాతి జనుల ఉద్ధరణలో తమ వంతు పాత్ర రాజకీయంగానే చేసి అధికారం కథ ఏంటో తేల్చుకుందామన్న తాపత్రయం కూడా ఉండాలి కదా అన్నదే ఆ భావజాలాన్ని ప్రేమిస్తున్న వారి బాధ.అలా కాకుండా ఇతర ప్రధాన పర్టీలతో అంటకాగితే వచ్చేది ఏమిలేదనే అంటున్నారు.