నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ( Nakrekal Assembly constituency ) పరిధిలోని రామన్నపేట మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి భారీ షాక్ తగలనుందా…? అంటే మండలంలో అవుననే సమాధానమే వినిపిస్తుంది.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలంతా హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఇందులో రామన్నపేట జడ్పీటీసీ పున్న లక్ష్మీ,ఆమె భర్త జగన్మోహన్,మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందడి ఉపేందర్ రెడ్డి( Mandadi Upender Reddy ), ఎనిమిది మంది సర్పంచులు,నలుగురు ఎంపీటీసీలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటికే మండల జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు కారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.
మిగతా సర్పంచులు,ఎంపీటీసీలు రెండు మూడు రోజుల్లో కారు దిగి హస్తం గూటికి వెళ్ళనున్నారనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది.ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ అధికార పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య రామన్నపేటలో పార్టీ మారుతున్న నేతల స్థానాన్ని భర్తీ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లు వినికిడి.
ఏది ఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ఊహాగానాలు ఊపందుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు వరుసకట్టి కాంగ్రెస్ లోకి వలసలు పోతుండటంతో జిల్లాలో గులాబీ క్యాడర్ లో గుబులు పుట్టిస్తోంది.