ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ప్రయాణికులకు అందజేసి మరో మారు నిజాయితీని చాటుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.
స్థానిక జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు జహీరాబాద్కు వెళ్లడానికి హైదరాబాద్ -2వ డిపోనకు చెందిన బస్సులో ఎక్కారు.జహీరాబాద్లో వారు దిగి రూ.40 వేల నగదు, రెండు తులాల బంగారం కలిగి ఉన్న విలువైన బ్యాగును బస్సులో మర్చిపోయారు.కొంతసేపటికి తర్వాత బస్సులో మర్చిపోయిన వస్తువుల సమాచారాన్ని జహీరాబాద్ డిపో అధికారులకు సమాచారం అందించగా వారి వద్ద ఉన్న టికెట్ ఆధారంగా హైదరాబాద్ టు డిపో అధికారులతో సంప్రదించి బస్సు కండక్టర్ను అప్రమత్తం చేశారు.
కండక్టర్ బస్సులో వెతకగా బ్యాగ్ లభించడంతో ఆ బ్యాగును మరో బస్సు ద్వారా జహీరాబాద్ డిపోనకు రప్పించి మహిళా ప్రయాణికులకు అప్పగించారు.తాము మర్చిపోయిన విలువైన వస్తువులు కలిగి ఉన్న బ్యాగును ఎంతో బాధ్యతగా తిరిగి తమకు అప్పగించిన జహీరాబాద్ డిపో సిబ్బందికి, అధికారులకు మహిళా ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.