చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
భారతీయులు ఈ విషయంలో ముందున్నారు.కేంద్ర ప్రభుత్వం కృషి, ప్రవాసీ సంఘాల తోడ్పాటు కారణంగా భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో మన విద్యార్ధులు రికార్డు సృష్టించారు.2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.అంతేకాదు.అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులలో 20 శాతం మంది భారతీయులేనని ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై నగరాల్లో వున్న యూఎస్ కాన్సులేట్లు ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఈ వీసాలను జారీ చేశాయని అమెరికన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయులకు.తొలి ప్రాధాన్యం అమెరికానే అన్నారు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి పాట్రీషియా లాసినా.
ఇకపోతే.నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఇటీవల కీలక ప్రకటన చేసింది.2023 ఆర్ధిక సంవత్సరానికి గాను అమెరికా కాంగ్రెస్ అనుమతించిన 65,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.దీనితో పాటు అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కింద జారీ చేసే 20,000 హెచ్ 1 బీ వీసాలకు సరిపడినన్ని దరఖాస్తులు వచ్చాయని యూఎస్సీఐఎస్ వెల్లడించింది.
అలాగే ఇప్పటికే అమెరికాలో విధులు నిర్వర్తిస్తున్న హెచ్ 1బీ ఉద్యోగి సమయం పొడిగింపు, ఉద్యోగ నిబంధనల మార్పు, కొత్త యాజమాన్యాల కింద పనిచేసేందుకు వచ్చే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని ఏజెన్సీ పేర్కొంది.