యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలో అందరూ కలిసి అన్నదాతను సమిష్టిగా అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుందని,ఒక వైపు పర్మిషన్ లేకుండానే వే బ్రిడ్జిల పేరుతో దళారులు, ప్రభుత్వ ఉద్యోగులు,ప్రైవేట్ కాంట్రాక్టర్లు మోసం చేయడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అంటున్నారు.
దీనికి తోడు ప్రకృతి కూడా పగబట్టినట్లు రైతుల కష్టం నోటికందే లోపే అకాల వర్షాలతో ఆగమాగం చేస్తుందని వాపోతున్నారు.గుండాల మండలంలోని 17 సెంటర్లలో 10 పిఎసిఎస్ పరిధిలో,7 ఐకెపి పరిధిలో పనిచేస్తున్నాయని,ఐకెపి పరిధిలో ఏడు సెంటర్లలో 35000 బస్తాలు కాంటా వేసినప్పటికీ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఏపిఎం అంజయ్య రైతులకు అవగాహన చేసి కొంత వరకు నష్టాన్ని నివారించగలిగారని, లారీల సమస్య తీరినట్లయితే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని అంటున్నారు.
పిఎసిఎస్ పరిధిలోని పది సెంటర్లలో 60,935బస్తాలు కాంటా వేసినప్పటికీ లారీలు, హామలి సమస్య ఉన్నదని పిఏసీఎస్ సీఈవో నాగయ్య తెలిపారు.ఆదివారం కురిసిన అకాల వర్షానికి పిఎసిఎస్ పరిధిలో ఉన్న 10 సెంటర్లలో సుమారుగా 3253 బస్తాలు కాంటా వేసినప్పటికీ లారీలను తీసుకొచ్చి లోడ్ వేయించడంలో నిర్లక్ష్యం కోట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
ఇదే విషయమై పిఏసీఎస్ సీఈవో నాగయ్యను ఫోన్లో సంప్రదించగా కాంటావేసి బస్తాలు నింపిన మాట వాస్తవమేనని,లారీలు కాంట్రాక్టర్లు పంపడంలో నిర్లక్ష్యం వల్ల రైతులు మోసపోతున్నారని,మేము సరైన సమయంలో పని చేసినప్పటికీ ప్రభుత్వం నుండి లారీలు సరైన సమయంలో రావట్లేదని, లారీల కాంట్రాక్టర్ పల్లెర్ల వెంకన్నను సంప్రదించాలని కోరారు.
లారీల కాంట్రాక్టర్ పల్లెర్ల వెంకన్నను వివరణ కోరగా సీఈఓ నాగయ్య ఇష్టానుసారంగా లారీలు ఉన్నవా లేవా అని సంప్రదించకుండానే ఒంటెదు పొకడతో రైతులను మోసం చేస్తున్నాడని, 10సెంటర్లలో కనీసం రోజుకు ఒక లారైన పంపియడం లేదని,హమాలీ సరైన టైంలో పనిచేయట్లేదని, గత ప్రభుత్వంలో 80 మిల్లులు కేటాయించారని ప్రస్తుతం 40 మిల్లులకే పరిమితం చేయడంతో కొంత ఆలస్యం అవుతున్నదని,72 లారీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్క మీల్లు దగ్గర రోజుకు మూడు నుండి ఐదు రోజులు పడుతున్నదని,లారీ యజమాన్యానికి గిట్టుబాటు కాకపోవడంతో డ్రైవర్లు కూడా అందుబాటులో ఉండటం లేదని,లారీలు,హమాలి సమస్యను ప్రభుత్వం తీర్చగలిగితే రైతులకు న్యాయం దక్కుతుందని చెప్పడం గమనార్హం.
స్థానిక రైతులు మాట్లాడుతూ కాంటా వేసిన బస్తాలను ప్రభుత్వమే బేషరతుగా తీసుకోవాలని, కాంటా వేసిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నారు.