హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థ ఒక నివేదికను విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ వాల్యూ దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.ఈ కంపెనీ మోసపూరిత కార్యకలాపాలు, స్టాక్ మానిప్యులేషన్లో నిమగ్నమైందని నివేదిక పేర్కొంది.
అదానీ గ్రూప్ ఈ వాదనలను ఖండించింది.అలానే హిండెన్బర్గ్ రీసెర్చ్పై దావా వేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ పరిశోధనా సంస్థ తన రీసెర్చ్లో పేర్కొన్న ప్రతి మాటకు కట్టుబడి ఉంటామని, దానిపై ఎలాంటి చట్టపరమైన చర్య తీసుకున్నా తమకేం ప్రాబ్లం లేదని స్పష్టం చేసింది.
స్టాక్ మానిప్యులేషన్ అనేది స్టాక్ ధరను కృత్రిమంగా పెంచే లేదా తగ్గించే చట్టవిరుద్ధమైన యాక్టివిటీ కాగా అకౌంటింగ్ ఫ్రాడ్ అంటే కంపెనీ తన ఆర్థిక నివేదికలను తప్పుగా చూపిస్తూ దాని ఆర్థిక పనితీరును తప్పుగా సూచించడం.
ఈ రెండు యాక్టివిటీలను అదానీ గ్రూపు గత కొన్ని చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్లో అదానీ గ్రూప్ దాదాపు రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది.మంగళవారం నుంచి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ.2.75 లక్షల కోట్లకు తగ్గింది.
మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్లో మళ్లీ దారుణంగా క్షీణించాయి.నివేదిక విడుదలైన రెండు రోజుల తర్వాత కంపెనీలు 8% వరకు నష్టపోయాయి.అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 17% భారీగా క్షీణించగా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ 12% పైగా పడిపోయాయి.అంబుజా సిమెంట్ 6% పైగా పడిపోయాయి, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 5% చొప్పున తగ్గాయి.గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 3.5% క్షీణించింది.
ఇదిలా ఉండగా, నివేదికను విడుదల చేసిన 36 గంటల్లో అదానీ తాను లేవనెత్తిన ఒక్క ముఖ్యమైన అంశాన్నైనా ప్రస్తావించలేదని పరిశోధనా సంస్థ పేర్కొంది.‘మా రిపోర్ట్లో 88 సూటి ప్రశ్నలను అడిగాం కానీ ఇప్పటివరకు అదానీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు’ అని హిండెన్బర్గ్ రీసెర్చ్ తెలిపింది.