ఆ చట్టం ప్రకారమే...:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని మంత్రి పేర్కొన్నారు.తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే టీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారన్నారు.వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు.

వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు.అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న మంత్రి, రాష్టాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అధ్వానంగా కిందిస్థాయికి పడిపోయిందన్నారు.తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశంలో తప్పాయన్నారు.

కేంద్రంలో ఒకలా,రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని మంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

Latest Suryapet News