హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికలలో సామాజిక రాజకీయ పార్టీల,సమస్త బీసీ సంఘాల యొక్క ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలబెట్టి గెలిపించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) అధ్యక్షుడు, సదరన్ పొలిటికల్ అకాడమీ (ఎస్.పి.
ఏ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నూనె వెంకట్ స్వామి పిలుపునిచ్చారు.శనివారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ మహల్ లో జరిగిన బీసీ రాజకీయ పార్టీల, సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడాతూ ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు బీసీ ఏతర సామాజిక తరగతుల అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించారు.
టీఆర్ఎస్ లాంటి అధికార పక్షం కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించడంలో తత్సారాన్ని ప్రదర్శిస్తోంది.అధికార పక్షం యొక్క ప్రచార నేపథ్యాన్ని పరిశీలిస్తే బీసీ అభ్యర్థిని ప్రకటించే స్థితి కనిపించడం లేదన్నారు.
మునుగోడు నియోజకవర్గ ఓటర్లలో 52 శాతం కలిగిన బీసీలలో గణనీయంగా గౌడ సామాజిక తరగతి నుండి అభ్యర్థిని పెట్టవలసిన ఆవశ్యకత ఉంది.అన్ని బీసీ సామాజిక పార్టీలు,సంఘాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికలలో పోటీలో పెట్టడానికి నిర్ణయం జరిగిందన్నారు.
బీసీ గౌడ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థిని గెలిపించే విధంగా బీసీ ఉప కులాలన్ని కదం తొక్కాలని,బీసీ అభ్యర్థిని గెలిపించడానికి ఎస్సి, ఎస్టీ,మైనారిటీ ప్రజలు ఓటు బదలాయింపు జరిపి అణగారిన అట్టడుగు,బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటి చెప్పేందుకు మేధావులు,యువకులు పెద్దఎత్తున కృషిని సాగించాలన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్.పి.ఏ.వ్యవస్థాపక అధ్యక్షుడు ఈదా శేషగిరి గౌడ్ అధ్యక్షత వహించగా,బీసీ అభ్యర్థి పోటీ ఆవశ్యకతను ఎస్.పీ.ఏ.రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వివరించారు.ఈ మీటింగ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆలిండియా అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,బహుజన రాజ్యాధికార ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని, స్వరాజ్ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ గౌడ్, ప్రొఫెసర్ మహమ్మద్ అన్వర్ ఖాన్,ఎంబీసీ ఆలిండియా అధ్యక్షుడు దేశ్ రామ్ నాయక్,సామాజిక రాజకీయ విశ్లేషకులు సూర్యారావు, ఎస్.పీ.ఏ.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ పడాల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు దేవు సాంబయ్య ముదిరాజ్,సకినాల హరినాధ్ పటేల్,గాలి చంద్రకళ,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సినిమా హీరో జైహింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.