కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చకచకా చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి రేపో, మాపో ఊడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో జరిగిన పలు పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం సిద్ధు (సిద్ధరామయ్య నిక్ నేమ్) విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
సీఎం సిద్ధరామయ్య ఆశ్రిత పక్షపాతంతో తన కుమారుడికి కాంట్రాక్టులు కట్టబెట్టడాన్ని కూడా అధిష్ఠానం తీవ్రంగా తీసుకుంది.
దీంతో ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఇదంతా ఒక ఎత్తయితే కర్ణాటక బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది.
సీఎం పీఠం దక్కించుకోగల అవకాశం ఉన్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ ఎం కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.ముఖ్యంగా ఎస్ ఎం కృష్ణ తనకున్న పలుకుబడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇందులో భాగంగానే ఆయన గతవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారని సమాచారం.
అంతేకాదు తనకు అవకాశం ఇస్తే రెండేళ్లలోనే పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చి, తగిన విరాళాలు కూడా అందేలా చూస్తానని ఆయన అధినేత్రికి హామీ ఇచ్చారు.







