గత కొంత కాలంగా సస్పెన్స్గా ఉన్న విషయానికి తాజాగా దిల్ రాజు తెర దించాడు.దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా రాబోతుందని కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి.
గతంలో పలువురు దర్శకులు నిర్మాతలు ఆయన్ను హీరోగా చేయమని అడిగారు.కాని ఆయన చేస్తాను, తప్పకుండా భవిష్యత్తులో చేస్తాను అంటూ వారికి మాట ఇస్తూ వచ్చాడు.
ఇన్నాళ్లకు దేవి శ్రీ ప్రసాద్ మొదటి సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమాను తాను సుకుమార్ దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.
తాజాగా విడుదలైన ‘కుమారి 21ఎఫ్’ సక్సెస్ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, దిల్రాజులు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు.అయితే ఎప్పుడు ప్రారంభం అయ్యేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు.
సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని దిల్ రాజు చెప్పడం వల్ల, ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.మొత్తానికి ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు తారా స్థాయిలో వస్తున్నాయి.
సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక స్టార్ పొజీషన్ను ఏర్పర్చుకున్న దేవిశ్రీ హీరోగా మెప్పిస్తాడా అనేది చూడాలి.







