వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి చాలా ధీమాగా చెబుతున్నారు.ఆయనకు ఎందుకింత ధీమా కలిగింది? కాంగ్రెస్కు ఏం కలిసి వచ్చింది? గులాబీ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తారని నమ్ముతున్నారు.రెండో అంశం పార్టీ జాతీయ నాయకుల ప్రచారం.వరంగల్లులో కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్, మాజీ హోం మంత్రి షిండే, మాజీ స్పీకర్ మీరా కుమార్ తదితరులు ప్రచారం చేస్తున్నారు.
వీరి ప్రచార ప్రభావం ఎక్కువగా ఉందని ఉత్తమ్ కుమార్ నమ్ముతున్నారు.తెలంగాణా సోనియా గాంధి కారణంగానే వచ్చిందని, ఇది కెసీఆర్ సాధించింది కాదని వారు ప్రచారం చేస్తున్నారు.
ఇద్దరు ఎంపీల వల్ల తెలంగాణా వస్తుందా అని ప్రశ్నించారు.సోనియా గాంధి దయ తలచక పొతే తెలంగాణా రాకపోయేదని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల ప్రచారం తీవ్రంగానే ఉంది.కాని వీరి ప్రచారం ప్రజలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో.
మీరా కుమార్ను, సుషీల్ కుమార్ షిండేను తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఉంది.ఇద్దరూ దళితులు కావడం ఒక కారణం.
తెలంగాణా ఇచ్చినప్పుడు మీరా కుమార్ లోక్ సభ స్పీకరుగా ఉండగా, షిండే హోం మంత్రిగా ఉన్నారు.తెలంగాణా ఇవ్వడంలో వీరి పాత్ర కూడా కీలకమే కాబట్టి వారితో ప్రచారం చేయిస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు భావించారు.
వరంగల్లులో పోటీకి మీరా కుమార్ పేరు కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే.