ఓ రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడిని తీవ్రంగా విమర్శించాలంటే అవతలి వ్యక్తిని ‘పిచ్చోడు’ కింద జమకడతాడు.పిచ్చెక్కింది, పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు, పిచ్చి ప్రేలాపనలు…ఇలా విమర్శించడం సర్వసాధారణం.
ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ నోటుకు ఓటు కుంభకోణంలో నిందితుడైన రేవంత్ రెడ్డిని ‘పిచ్చోడు’ అని విమర్శించారు.ఎందుకు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారు కాబట్టి.హైకోర్టు ఆంక్షల కారణంగా రేవంత్ చాలాకాలంగా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్కే పరిమితమయ్యారు.దీంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు.చివరకు ఆయన విజ్ఞప్తిని మన్నించిన హైకోర్టు ఆంక్షలు సడలించింది.దీంతో ఆయన భారీ ఊరేగింపుతో నగరానికి వచ్చారు.
వచ్చీ రాగానే కేసీఆర్పై పదునైన మాటల ఈటెలు విసిరారు.తాను నగరంలో అడుగు పెట్టగానే కేసీఆర్ చైనా వెళ్లిపోయారని (తానంటే కేసీఆర్కు భయమని చెప్పడమన్నమాట) వ్యంగ్య బాణాలు వేశారు.
గతంలో తనకు బెయిల్ రాగానే ఆయనకు జ్వరం వచ్చిందన్నారు.రేవంత్ ఇలా విమర్శలు చేయడంతో సుమన్కు కోపం వచ్చింది.‘రేవంత్కు పిచ్చి పట్టింది’ అని విమర్శించారు.నోటుకు ఓటు కేసులో నిందితుడైనందుకు రేవంత్ సిగ్గు పడాలని, కాని ఆ కేసులో తన ప్రమేయమే లేదని చెబుతున్నాడని అన్నారు.
ఇది పిచ్చి కాక మరేమిటి? అని సుమన్ ప్రశ్నించారు.ఒక్క రేవంతే కాదు.
రాజకీయ నాయకులు చాలామంది పిచ్చిగానే మాట్లాడతారు.రాజకీయాల్లో చేరకముందు మామూలుగానే ఉన్నా చేరాక పిచ్చి ఆటోమేటిగ్గా ఎక్కుతుంది.