ఏ విషయంలో? ఎవరు మాట్లాడకూడదు? ఇదో రాజకీయంలెండి…! మీరేం మాట్లాడకండి అని భాజపాను ఆ పార్టీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అంటున్నాట్ట…! అసలు విషయం ఏమిటంటే…యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మోదీ సర్కారు ఓ కమిటీ వేసింది.ఏమిటా కమిటి? అది చేసిన పని ఏమిటి?…అంటే, ప్రస్తుత ఎంపీల జీతభత్యాలు, మాజీ ఎంపీలకు పింఛన్లు, ఇతర ప్రయోజనాలు భారీగా పెంచుతూ సిఫార్సు చేసింది.జీతాలు ఏకంగా రెండింతలు చేసింది ఈ కమిటీ.దేశం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండగా, ప్రధాని మోదీ పనితీరు అంత బాగాలేదని విమర్శలు వినవస్తుండగా, పార్లమెంటు సభ్యులు వారికివారే జీతాలు పెంచుకోవడంపై దుమారం రేగుతోంది.
ఉద్యోగులైనా, ప్రజాప్రతినిధులైనా జీతాలు పెంచితే సంతోషిస్తారుగాని ఏడవరు కదా…! ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) ఎప్పుడు జీతాలు పెంచుకున్నా కమ్యూనిస్టులు తప్ప ఎవరూ విమర్శించరు.ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కమిటీ జీతభత్యాలు, పింఛన్లు పెంచుతూ చేసిన ప్రతిపాదనలపై భాజపా తన సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే విపరీతంగా విమర్శలు వస్తాయి.
అందుకే ఆదిత్యనాథ్ ‘మీరేమీ మాట్లాడకండి’ అని పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నాడట.ఈ అంశంపై పెదవి విప్పకుండా దూరంగా ఉండాలన్నాడట…! దీనిపై భాజపాకు చెందిన ఒక నాయకుడు మాట్లాడుతూ ‘దీనిపై మేం ఏమీ మాట్లాడం.
కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది.కమిటీకి మా ఎంపీ నేతృత్వం వహించారు.అయినప్పటికీ నివేదికను ప్రభుత్వం పక్కకు పెట్టింది.త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది’ అన్నాడు.
ఈ నెల పదమూడో తేదీన ఆదిత్యనాథ్ కమిటీ తుది నివేదిక తయారు చేస్తుందట.ఒకటి రెండు మినహా ఈ కమిటీ చేసిన అన్ని సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించే అవకాశముందని అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ర్టం విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంచిన విషయం గుర్తుంది కదా…! జీతాలు ఉన్నంతస్థాయిలో వీరి ప్రజాసేవ ఉంటుందా? ఎంత భారీగా జీతాలు పెంచినా చాటుమాటుగా సంపాదిస్తూనే ఉంటారు.ఆ బుద్ధి మాత్రం మార్చుకోరు.







