నల్లగొండ జిల్లా: పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామంలోని 283 సర్వే నెంబర్లో 38 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో వందల ఏళ్ల నాటి సిద్దిరెడ్డి చెరువు నేడు కబ్జా కోరల్లో చిక్కుకుని మొత్తం ఖాళీ అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామానికి సాగునీరు,పశుపక్ష్యాదులకు త్రాగునీరు అందిస్తూ భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడే చెరువును కొందరు కబ్జాదారులు ఆక్రమిస్తూ సాగు భూమిగా మార్చుకుంటున్నారని, పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని,అధికారులు కూడా కబ్జాదారులకే వత్తాసు పలుకుతూ నిర్లక్ష్య వైఖరితో మాట్లాడుతున్నారని,చెరువును కబ్జా చేసిన వారిలో భూమిలేని నిరుపేదలు ఎవరూ లేరని,అందరూ బడా భూస్వాములే ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారని,
దీనితో చెరువు నుండి ఆయకట్టుకు నీరు అందకుండా కబ్జాదారులే అడ్డుపడుతున్నారని వాపోతున్నారు.
సాధారణంగా పేదలు 60 గజాల ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటేనే అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు.కానీ,ఎకరాల కొద్దీ చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిద్దిరెడ్డి చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి,చెరువు హద్దు రాళ్ళను పాతి,కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని కోరుతున్నారు.