ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ ( Telangana ) ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది.మొన్నటి వరకు తెలంగాణలో టిడిపి ఉన్నా లేదన్నట్లుగానే పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.ఏపీలో టిడిపి అధికారంలో ఉండడంతో, ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని, తమకు రాజకీయంగా పలుకుబడి ఉంటుందని భావిస్తున్న పార్టీ సీనియర్ నాయకులు చాలామంది అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ లో తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) రాజీనామా చేయడంతో, అప్పటి నుంచి ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది.దీంతో మొదటి నుంచి టిడిపిలోనే ఉంటూ, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతలు తమను చంద్రబాబు గుర్తిస్తారని, పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే చంద్రబాబుతో పాటు, లోకేష్, బాలకృష్ణ వంటి వారితో సంప్రదింపులు చేస్తూ, వారి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.త్వరలోనే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని భర్తీ చేస్తామని చంద్రబాబు లీకుల ఇవ్వడంతో, ఇప్పుడు పోటీ తీవ్రం అయింది.రాష్ట్ర కమిటీల్లో కొంతమంది నేతలు పదవుల్లో ఉండగా, కొన్ని ఖాళీలు ఉన్నాయి.పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీని నియమించాలని చంద్రబాబు భావిస్తూ ఉండడంతో, ఇప్పటి వరకు యాక్టివ్ గా పనిచేస్తున్న నేతల వివరాలను ఆయన ఆరా తీస్తున్నారు.
తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి( TTDP President ) పార్టీ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న సామ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కాని నర్సింహులు, పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సామ భూపాల్ రెడ్డి( Sama Bhoopal Reddy ) 1932 నుంచి టిడిపిలో కొనసాగుతున్నారు.టిడిపి నుంచి ఉప్పరపల్లి సర్పంచ్ గా, ఆ తరువాత రాజేందర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేశారు.చేవెళ్ల ఎమ్మెల్యేగా 2004లో పోటీ చేసి ఓటమి చెందారు.
ఆ తరువాత పార్టీ శిక్షణ కార్యక్రమాలకు ఇన్చార్జిగా పనిచేశారు.ప్రస్తుతం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఇక కాట్రగడ్డ ప్రసూన( Katragadda Prasuna ) 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అప్పటి నుంచి టిడిపిలో వివిధ హోదాల్లో పనిచేశారు.ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.34 కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు.బక్కాని నరసింహులు( Bakkani Narasimhulu ) షాద్ నగర్ ఎమ్మెల్యేగా 1994లో విజయం సాధించారు.రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.వీరితో పాటు అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, పద్మావతి, ఆనంద్ తో పాటు అనేకమంది అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.దీంతో వీరిలో ఎవరికి చంద్రబాబు ఆశీస్సులు ఉంటాయనేది తెలంగాణ టిడిపిలో ఆసక్తికరంగా మారింది.







