ఇప్పటికే అనేక ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ పార్టీ( BRS ) అతలాకుతలం అయింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ నేతలను కుంగదీయగా.
ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను, ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించకపోవడం వంటివి ఆ పార్టీ అధినేత కెసిఆర్ కు( KCR ) మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఎంతోమంది ఇటీవల కాంగ్రెస్ లో( Congress ) చేరిపోయారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించిన వారు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడం కేసీఆర్ కు ఇప్పటికీ మింగుడు పడడం లేదు.

ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.మొదట్లో బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.తాజాగా మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి( Pocharam Srinivas Reddy ) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్( MLA Doctor Sanjay ) షాక్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు పోటీ చేసిన సంజయ్ రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై గెలుపొందారు.కేసీఆర్ కుమార్తె కవితకు సన్నిహితంగా మెలిగిన సంజయ్ పార్టీ మారుతారని ఎవరు ఊహించలేకపోయారు.

డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరుకుంది.ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, తాజాగా సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఇంకా మరి కొంతమంది కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.దీంతో పార్టీ మారే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ? వారిని ఏ విధంగా బుజ్జగించి పార్టీ మారకుండా ఆపాలనే విషయంపైనే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దృష్టి సాధించబోతున్నారట.







