నల్లగొండ జిల్లా: మహాభారతంలో ధర్మరాజును జూదంలో వ్యూహాత్మకంగా దెబ్బతీసి అడవులపాలు చేసిన ఉదంతం మనకు తెలిసిందే.కానీ,ఇప్పుడు ఆడే నయా జూదంలో ఓడినవారు అడవులకెళ్ళడం కాదు, ఏకంగా తనువులు చాలించాల్సి వస్తుంది.
ఇది ఎదురుపడి ఆడే ఆట కానే కాదు.ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ లేదు.
కానీ,బ్యాంకు ఖాతా( Bank Account ) మాత్రం ఖాళీ అవుతోంది.ఈ ఆట దెబ్బకు సర్వస్వం కోల్పోయిన ధర్మరాజులూ లేకపోలేదు.
కాయ్ రాజా కాయ్”అంటూ ఒకప్పుడు జాతరలలో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా జడలు విప్పాయి.మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి దివాళా తీస్తున్నారు.
అంతటితో ఆగకుండా ఆటో,నేనో తేల్చుకోవాలని పంతం పడుతున్న కొందరు అప్పులు చేసి మరీ ఆటలో గుమ్మరిస్తున్నారు.
చివరికి సర్వం కోల్పోయి,చేసిన అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్మేందుకు సైతం తెగిస్తున్నారు.
ఆస్తులు లేని వారు మరో మార్గం దొరక్క ఇక చావే శరణ్యమని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు కోకొల్లలు.ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ ప్లే మొబైల్ ఫోన్ పుణ్యమా అని ప్రసుత్తం పల్లెలను తాకింది.
చెమటోడ్చి సంపాదించడానికి మొగ్గుచూపని యువత ఈజీ వే లో కోటీశ్వరులు కావాలని ఇలాంటి వాటి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితుల ద్వారా,ఆన్లైన్ ప్రకటనల ప్రలోభాలతో ఈ ఉచ్చులోకి దిగుతున్నారు.
జూదం నిర్వాహకులు మొన్నటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు,ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ పందేలకు వేదికగా మలుచుకోవడం గమనార్హం.తాజాగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఈ బెట్టింగ్ వేదిక మీదికి వచ్చి చేరడం ఖాయం.
ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కాసినట్లు సమాచారం.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేస్తున్నారు.
తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత కదలకుండా ఉచ్చు బిగించి అందినకాడికి దోచేస్తున్నారు.ధనిక,పేద,మధ్యతరగతి,చిరు వ్యాపారులు,ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచూ మోసపోతూనే ఉన్నారు.
రుణాల ఊబిలో చిక్కుకుని బాధితుల్లో అత్యధికులు స్మార్ట్ ఫోన్లపై గంటల కొద్దీ సమయం గడుపుతున్న వారే ఉండటం గమనార్హం.తొలుత కొంత నష్టపోతున్న ఆటగాళ్లు మళ్లీ తిరిగి పొందలేకపోతామా? అన్న ధీమాతో అప్పులు చేసి మరీ ఆటలో గుమ్మరిస్తున్నారు.సులువుగా అప్పు దొరుకుతుండటంతో ఆన్లైన్ రుణ యాప్ లను ఆశ్రయిస్తుండటం మరో ఊబిలోకి దిగుతున్నట్లు అవుతోంది.ఆన్లైన్ రుణ యాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు.అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషన్ కు లోనవుతున్నారు.
అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను,కుటుంబాలను ఛిద్రం చేసుకున్న వారు ఇంకొందరు.అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముక్కుతాడు వేయలేకపోతున్నారా?అంటే కనిపిస్తున్న పరిస్థితిని చూస్తే అదే అనిపిస్తుంది.ఈ ఆన్లైన్ బెట్టింగ్ కేవలం ఆస్తులు కోల్పోయి,ఆత్మహత్యలు జరిగినప్పుడు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్ జూదాలపై ఉక్కుపాదం మోపకుంటే యువత పూర్తిగా నిర్వీర్యం అవుతుందని జిల్లా అంటున్నారు.







