మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం వివిధ శాఖల అధికారులతో సమీక్షలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.వైద్య సిబ్బంది వద్ద మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా పెట్టుకోవాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ వారు బస్ లను సమయానుకూలంగా నడిపించాలని, సెస్ అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
పరీక్ష పత్రాలు పోలీస్ బందోబస్తు మధ్య తరలించాలని, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు.గంట ముందే చేరుకోవాలి ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి మార్చి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు.ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4609 మంది, సెకండియర్ విద్యార్థులు 3934 మంది హాజరు కానున్నారని వెల్లడించారు.
జిల్లాలోని మొత్తం 18 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే పదో తరగతి పరీక్షలు మార్చి 18 వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ దాకా నిర్వహించనున్నారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు.మొత్తం విద్యార్థులు 6475 మంది హాజరు కానున్నారని వెల్లడించారు.
జిల్లాలోని మొత్తం 35 సెంటర్ లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులు పరీక్ష సమయానికంటే గంట ముందే చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావద్దని సూచించారు.
ఈ సమావేశంలో డీఈఐఓ మోహన్, డీఈఓ రమేష్ కుమార్, డీపీఓ వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈఈ జానకి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీరాములు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మహేష్ బాబు, సెస్, పోస్టల్, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
.