నల్లగొండ జిల్లా: కొత్త నిర్మాణం మొదలు పెట్టే ముందే వాస్తు దోషం లేకుండా చూసుకోవడమూ,ఇంటికి వాస్తు దోషం ఉందని మార్పులు చేర్పులు చేయడం చూస్తూ ఉంటాం.అయితే ఓ పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం ఉందని,అందుకే ఆ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్ఐలు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఒకరిద్దరు కాదు.పది నెలల కాలంలో పదకొండు మంది ఎస్ఐలు బదిలీ కావడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లు అయింది.
ప్రస్తుతం పోలీస్ అధికారులు వాస్తు దోష నివారణ పనులు మొదలు పెట్టడడం గమనార్హం.ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడుందని అనుకుంటున్నారా…? వివరాల్లోకి వెళితే…నల్గొండ జిల్లాలో హైదరాబాద్- నాగార్జున సాగర్ నేషనల్ హైవేపై ఉన్న చింతపల్లి మండల పోలీస్ స్టేషన్కు డిపార్ట్మెంట్ లో క్రేజ్ ఎక్కువ.ఇక్కడ పని చేయాలని ఎస్ఐలు పోటీపడుతూ సిఫార్సుల కోసం రాజకీయ నేతల చుట్టూ తిరుగుతుంటారు.అయితే ఇదంతా మొన్నటి వరకే.
ఇప్పుడు ఆ స్టేషన్ కు వెళ్లాలంటే ఎస్ఐలు జంకుతున్నారు.ఇటీవల పది నెలల కాలంలో అక్కడికి బదిలీపై వెళ్లిన 11 మంది ఎస్ఐలను వివాదాలు చుట్టుముట్టడమే దీనికి కారణమంటున్నారు.
క్లీన్ చిట్ తో వచ్చిన ఎస్ఐలు కూడా ఇక్కడికి రాగానే వివాదాల్లో చిక్కుకుంటున్నారని,దీనికి స్టేషన్ కు ఉన్న వాస్తు దోషమే కారణమని డిపార్ట్మెంట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ ప్రచారం నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి చింతపల్లి పోలీస్ స్టేషన్ లో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టడం గమనార్హం.
అంతేకాదు ఓ వాస్తు పండితుడు చెప్పాడని స్టేషన్ ముందున్న గోడను కూడా కూల్చేశారు.
ఈ దెబ్బతో స్టేషన్ కు పట్టిన వాస్తు దోషం తొలిగిపోతుందా?బదిలీపై వచ్చిన ఎస్ఐ కొంతకాలం పాటు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తారా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే మరి.!ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం ఏమిటి విడ్డూరం కాకపోతే అంటూ సెటైర్లు వేస్తుంటే,ఎవరి నమ్మకాలు వారివని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.







