శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది మంది హిందువులు ఎప్పుడెప్పుడు రాములోరిని దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.
జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా శ్రీరామ మందిరం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వీవీఐపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇందుకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభించి 10 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.2019 నవంబర్లో అయోధ్య( Ayodhya ) వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించడంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది.ఆగస్ట్ 2020లో శ్రీరామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

కాగా.అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్లో( Washington ) హిందూ సంఘం కార్ల ర్యాలీని( Car Rally ) చేపట్టింది.శనివారం ఫ్రెడరిక్ సిటీ సమీపంలోని అయోధ్య వేలో వున్న శ్రీ భక్తాంజనేయ ఆలయం వద్దకు ర్యాలీ చేసినట్లు విశ్వహిందూ పరిషత్ డీసీ చాప్టర్ అధ్యక్షుడు మహేంద్ర తెలిపారు.
జనవరి 20న వాషింగ్టన్లో దాదాపు 1000 హిందూ అమెరికన్ కుటుంబాలతో ఓ వేడుకను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పుట్టిన పిల్లలకు శ్రీరాముడి జీవితం , వ్యక్తిత్వం, పాలన గురించి వారికి అర్ధమయ్యేలా ప్రదర్శన వుంటుందని మహేంద్ర పేర్కొన్నారు.

మరోవైపు.అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ అమెరికన్లు( Hindu Americans ) తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించారు.వేడుకలు నిర్వహించే బాధ్యతను తీసుకున్న విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్పీఏ) 1000కి పైగా దేవాలయాలు, వ్యక్తులు పాల్గొనేందుకు వీలుగా https://rammandir2024.org వెబ్సైట్ను ప్రారంభించింది.నమోదు చేసుకున్న ఆలయాలకు ప్రసాదం అందిస్తామని వీహెచ్పీఏకు చెందిన అమితాబ్ మిట్టల్ తెలిపారు.హిందూ అమెరికన్లు రిమోట్గా వేడుకల్లో పాల్గొనేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.వేడుకల ప్రత్యక్ష ప్రసారాల కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.ఆలయంలో పవిత్రోత్సవంలో భాగమయ్యేలా హిందూ అమెరికన్లంతా వారి ఇళ్లలో కనీసం ఐదు దీపాలను వెలిగించాలని వీహెచ్పీఏ పిలుపునిచ్చింది.







