‘బర్రెలక్క ‘ ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది .స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన శిరీష( Sirisha ) అలియాస్ బర్రెలక్క ఇప్పుడు ప్రధాని పార్టీలకు కంటిలో నలుసు లా మారారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగారు.ప్రధాన పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు .సోషల్ మీడియాలో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష నిరుద్యోగుల ఇబ్బందులపై సోషల్ మీడియా ద్వారా గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఇక సోషల్ మీడియాలోనూ ఆమెకు మద్దతుగా అందరూ నిలబడుతుండడం వంటివి ప్రధాన పార్టీలకు మింగుడు పడడం లేదు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు.
ఆమెను ఎన్నికల నామినేషన్ నుంచి విత్ డ్రా చేయించాలని ప్రయత్నాలు ప్రధాన పార్టీల అభ్యర్థులు చేసినా, అది సక్సెస్ కాలేదు.పైగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా అడ్డం పడడం, దాడి చేయడం వంటివి ఆమెకు మరింతగా పాపులారిటీ తీసుకొచ్చాయి.ఇక హైకోర్టు సైతం ఆమెకు ప్రత్యేకంగా గన్ మెన్ ను కేటాయించాలని ఆదేశించడం తో మరింత పాపులారిటీ పెరిగింది.
దీంతో బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లు ఎక్కువ టెన్షన్ పడుతున్నాయి .ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ తమ ఓట్లను చీల్చుతుందేమోనని టెన్షన్ పడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే తాము నష్టపోతాని కాంగ్రెస్ అభ్యర్థికి టెన్షన్ మొదలైంది.ఈ విధంగా రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రధానంగా బర్రెలక్క కారణంగా టెన్షన్ పడుతున్నారు .ఎన్నికల ప్రచారం లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.డబ్బు లేకపోయినా, ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయినా, బర్రెలక్క కారణంగా కొల్లాపూర్ లో ఎవరి ఓటమికి ఆమె కారణం కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
కొల్లాపూర్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండగా, కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ), బిజెపి అభ్యర్థిగా సుధాకర్ రావుల పోటీ చేస్తున్నారు.ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్( Congress ) గెలుస్తూ ఉండగా బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించింది.
అయితే ఇప్పుడు బర్రెలక్క చీల్చే ఓట్లు ఎవరి కొంపముంచుతాయో అనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో నెలకొంది.