భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో సౌత్ ఆఫ్రికా జట్టు రికార్డుల మోత మోగిస్తోంది.తాజాగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును పసికూనను చేసి ఘోరంగా ఓడించి, సౌత్ ఆఫ్రికా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకొని పాయింట్లు పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
సౌత్ ఆఫ్రికా జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ డి కాక్( Quinton de Kock ) సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా జట్టు తన తొలి మ్యాచ్ శ్రీలంకతో తలపడి 428 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మ్యాచ్లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు.డి కాక్, ఐడెన్ మార్కరం, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ సెంచరీలు చేశారు.

సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ డి కాక్ వరుసగా రెండు మ్యాచ్లలో సెంచరీలు సాధించాడు.శ్రీలంక తో జరిగిన తొలి మ్యాచ్లో 100 పరుగులు, ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో 109 పరుగులు చేశాడు.దీంతో ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టుపై అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా డి కాక్ నిలిచాడు.గతంలో ఈ రికార్డ్ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర( Kumar Sangakkara ) పేరిట ఉండేది.తాజాగా జరిగిన మ్యాచ్ తో డి కాక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.2015 ప్రపంచ కప్ లో సిడ్ని వేదికగా ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో కుమార సంగక్కర 104 పరుగులు చేశాడు.

ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా పై ఇప్పటివరకు ముగ్గురు వికెట్ కీపర్ లు సెంచరీలు చేశారు.శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కరతో పాటు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం, తాజాగా డి కాక్ సెంచరీలు సాధించారు.ఇక మన భారత జట్టు విషయానికి వస్తే.ప్రస్తుత భారత జట్టు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఈ ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా పై 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కేవలం 3 పరుగుల తేడాతో ఈ ఘనత మిస్ చేసుకున్నాడు.భారత మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించడంలో విఫలమయ్యారు.2019 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై ధోని 65 పరుగులు చేశాడు.ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా పై ధోనికి ఇదే అత్యుత్తమ స్కోరు.
ఈ టోర్నీలో సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగితే కేఎల్ రాహుల్( KL Rahul ) కు ఈ ఘనత సాధించే అవకాశం లభిస్తుంది.







