ఓ యువకుడు జిమ్ లో వ్యాయామం చేసి ఫోన్ లో మాట్లాడుకుంటూ సెల్లార్ లో ఉన్న తన బైక్ ను బయటకు తీస్తూ ఉండగా క్షణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ( Rajendranagar )పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సెలబ్రిటీ జిమ్ సెల్లార్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు పుప్పల గూడ అలీజిపూర్ ప్రాంతానికి చెందిన రాహుల్ సింగ్ ( Rahul Singh )(26) గా గుర్తించారు.రాహుల్ సింగ్ ప్రతిరోజు ద్విచక్ర వాహనంపై సెలబ్రెటీ జిమ్ లో వ్యాయామం చేసేందుకు వస్తుంటాడు.
రోజు మాదిరిగానే మంగళవారం సాయంత్రం కూడా జిమ్ కు వచ్చి వ్యాయామం పూర్తిచేసుకుని తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
రాహుల్ సింగ్ కోసం నలుగురు యువకులు ముందుగానే సెల్లార్లో ఇతని కోసం వేచి చూసి, ఇతను వచ్చిన వెంటనే కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి.కత్తులు, పంచ్లతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడ్డ రాహుల్సింగ్ కుప్పకూలిపోయాడు.
సెల్లర్ లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఈ ఘటన ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా స్వల్ప గాయాలయ్యాయి.రక్తపు మడుగులో ఉన్న రాహుల్ సింగ్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
దాడి చేసిన యువకులు అనంతరం ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆ సెల్లార్ లో ఉండే సీసీ కెమెరాను రికార్డు పరిశీలించగా అందులో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.రెండు కత్తులు, పెప్పర్ స్ప్రే బాటిల్, ఒక పంచ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డివిజన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి పరిశీలించారు.మృతుడి కుటుంబ సభ్యులను విచారిస్తే హత్యకు గల కారణాలు తెలుస్తాయని డీసీపీ వెల్లడించారు.