ఇటీవల కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం.స్వలాభం కోసం, పరిస్థితుల కారణంగా అత్యంత దారుణంగా ఘరానా మోసాలు చేసే వారి సంఖ్య రోజుకు పెరుగుతూ పోతోంది.ఈ క్రమంలోనే ఓ శనగ వ్యాపారి ఏకంగా రూ.15 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.ఈ శనగ వ్యాపారికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.అనంతపురం జిల్లా( Anantapuram ) కణెకల్లు మండలం హనకనహల్ గ్రామనికి చెందిన శనగ వ్యాపారి రైతులకు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు.దాదాపుగా ఆరు రోజులు గా వ్యాపారి ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన రైతులు( Farmers ) వ్యాపారి ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పక్కా ప్రణాళిక ప్రకారం వ్యాపారి కుటుంబ సభ్యులతో పాటు పాడి పశువులు, కోళ్లతో సహా రాత్రికి రాత్రే గ్రామం నుండి పరారైనట్లు గ్రామస్తులు గ్రహించారు.కుమారుడితో కలిసి సదరు వ్యాపారి కొన్నేళ్లుగా శనగ వ్యాపారం చేసేవాడు.రైతుల నుంచి అనామతు పద్ధతిలో శనగలు( Chickpeas ) కొనుగోలు చేసేవాడు.
అనామతు అంటే రైతు సొమ్ము అడిగిన సమయంలో బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించాలని చేసుకొనే ఒప్పందం.అలా రైతులు అడిగినప్పుడు సొమ్ము చెల్లించేవాడు.గత రబీలో సొల్లాపురం, వ్యాసాపురం, బెలుగుప్ప, కోనాపురం, తగ్గుపర్తి తదితర గ్రామాల రైతుల వద్ద అనామతు పద్ధతిలో శనగలు కొనుగోలు చేశాడు.

అప్పట్లో ఒక క్వింటాల్ శనగల ధర రూ.4500 ఉండేది.దాదాపుగా వంద మంది రైతుల నుండి 14 వేల బస్తాలకు పైగా కొనుగోలు చేశాడు.ప్రస్తుతం ఒక క్వింటాల్ శనగల ధర రూ.6100 నుంచి రూ.6500 వరకు పలుకుతోంది.అంటే అప్పటితో పోల్చుకుంటే క్వింటాల్ రూ.1600-2000 వరకు అధికంగా పెరిగింది.శనగల ధర పెరగడంతో రైతులు సొమ్ము కోసం వ్యాపారి చుట్టూ తిరుగుతున్నారు.అంతే కాకుండా సదరు వ్యాపారి రైతులకు రూ.5 కోట్ల మేర పాత బకాయిలు చెల్లించాల్సి ఉంది.దీనికి తోడు ధర పెరగడంతో తాను నష్టపోయానని ఫోన్ చేసిన రైతులకు చెప్పడంతో పాటు తాను సొమ్ము చెల్లించలేను అని చెబుతున్నాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







