ఈ ఏడది అక్టోబర్ చివరి నాటికి తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడం ఖాయం కావడంతో, మూడు ప్రధాన పార్టీలైన బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు స్పీడ్ పెంచాయి.ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీ వ్యూహాలను రచిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో , ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరికి వారు తగిన వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు.తమ పార్టీలోని గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు.
అప్పుడే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై క్లారిటీకి వచ్చాయి.ఈ నెలలోనే అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల లిస్టును ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.
అలాగే సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకోవడంతో పాటు, తమ ప్రత్యర్ధి పార్టీలపై రివేంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.100 అబద్ధాల బిజెపి( BJP party ) పేరుతో ప్రగతి భవన్ లో సీడీ ని , బుక్ లెట్ ను బీఆర్ఎస్( BRS party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.దీని ద్వారా బిజెపి ని టార్గెట్ చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

ఇక బిజెపి విషయానికి వస్తే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ మూడు దశల ఉద్యమానికి సిద్ధమైంది. కేసీఆర్( CM kcr ) హఠావో … తెలంగాణ బచావో నినాదాన్ని హైలెట్ చేస్తోంది.ఈ మేరకు పార్టీ ప్రణాళిక ను వెల్లడించింది.
మొదటి విడతలో భాగంగా ఆగస్టు 16న పల్లెబాట, బస్తీబాట, ఆగస్టు 15న బాధితులతో, దరఖాస్తుదారులతో మండల, డివిజన్ ల ముట్టడి, ఆగస్టు 18న ప్రధాన రహదారుల్లో రాస్తారోకో , ధర్నా, ముట్టడి కార్యక్రమాలు చేపట్టనుంది.రెండో విడతలో భాగంగా ఆగస్టు 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావ్, ఆగస్టు 24న మంత్రుల ఘెరావ్, ఆగస్ట్ 27న కలెక్టరేట్ ల ముట్టడి, జైల్ భరో నిర్వహించనుంది.
మూడో విడతగా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది.

కాంగ్రెస్( Congress party ) విషయానికి వస్తే … ఎన్నికల ప్రణాళికలో భాగంగా టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయింది.అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది.ఈనెల 18 నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది.
ఆ తర్వాత అభ్యర్థుల వడబోత పై దృష్టి సారించబోతున్నారు.త్వరలోనే అభ్యర్థులు లిస్టును ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది .అలాగే బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి విమర్శలతో ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తోంది.







