సమాజంలో మానవత్వం అనే మాటకు విలువ లేకుండా పోతోంది.ఎవరైనా దగ్గరకు తీసి చేరదీస్తే వారి పట్ల ఎంతో కృతజ్ఞత భావంతో వెలగాలి.
అలా కాకుండా చేరదీసిన వారి ఆస్తిపై కన్నేసి దారుణాలకు పాల్పడితే అటువంటి వారిని ఏమనాలో.ఈ కోవలోనే ఓ దంపతులకు సంతానం కలగలేదని తమ అన్న కుమారుని చేరదీస్తే.
ఆ యువకుడు ఏకంగా ఆస్తి కోసం చిన్నాన్న, చిన్నమ్మలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.ఈ దాడిలో చిన్నమ్మ ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad ) బెజ్జూరు మండలంలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

బెజ్జూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.బెజ్జూరు లో కేశగౌడ్, చంద్రకళ (60) అనే దంపతులు నివాసం ఉన్నారు.వీరికి సంతానం లేదు.కేశ గౌడ్( Kesha Goud ) అన్న కుమారుడైన వెంకటేష్ గౌడ్ ను గతంలో చేరదీశారు.అయితే వెంకటేష్ గౌడ్ ( Venkatesh Goud ) ఈ దంపతుల ఆస్తిపై కన్నేశాడు.చిన్నమ్మ, చిన్నాన్నలను హత్య చేస్తే ఆస్తి మొత్తం తనకే చెందుతుందని భావించాడు.
ప్లాన్ లో భాగంగా శుక్రవారం తన సొంతూరు కన్నేపల్లి నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెజ్జూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటికి వెళ్ళాడు.ఆ దంపతులతో ఆస్తి కోసం గొడవ పెట్టుకున్నాడు.

కాసేపు మాటల యుద్ధం నడిచాక విచక్షణా జ్ఞానం కోల్పోయిన వెంకటేష్ గౌడ్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో చిన్నమ్మ చంద్రకళ పై దాడి చేశాడు.అడ్డుగా వచ్చిన చిన్నాన్న కేశ గౌడ్ పై కూడా దాడి చేశాడు.దీంతో కేశ గౌడ్ బిగ్గరగా కేకలు వేయడంతో వెంకటేష్ గౌడ్ అక్కడి నుండి పారిపోయాడు.తీవ్ర గాయాలైన చంద్రకళను ( Chandrakala ) ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.
కేశ గౌడ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేశ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







