తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.ప్రజల్లో తమ పార్టీపై ఆదరణ పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించాయి.
ప్రజల్లో ఏ ఏ విషయాలపై అసంతృప్తి ఉంది అనే విషయం పైన అధికార పార్టీ బీఆర్ఎస్ దృష్టి సారించగా, బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వ తప్పిదాలను హైలెట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, పోరాటాలు చేసి తమ పార్టీలపై ఆదరణ పెంచుకోవాలని కాంగ్రెస్, బిజెపిలో ప్రయత్నాలు చేస్తున్నాయి.దీంతో పాటు చేరికల పైన అన్ని ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి.

ఎన్నిక సమయం నాటికి భారీ ఎత్తున చేరికలు ఉంటే తమకు తిరుగు ఉండదని , ఇతర పార్టీలలోని కీలక నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చని బిఆర్ఎస్, బిజెపి( BJP party ) , కాంగ్రెస్ లు భావిస్తున్నాయి.అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ బిజెపిలకు చెందిన కీలక నాయకులకు అనేక పదవుల హామీ ఇస్తూ, పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, బిజెపి సైతం రకరకాల హామీలు ఇస్తూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను చేర్చుకునే పనిలో పడింది.ఆ పార్టీలోని అసంతృప్తి నేతలను గుర్తించి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ కీలక పదవులను ఆఫర్ చేస్తున్నారు.ఇక ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్, బిజెపిలకు చెందిన కీలక నేతలు చేరుతుండడం , ఇంకా అనేకమంది చేరేందుకు మంతనాలు చేస్తూ ఉండడంతో, కాంగ్రెస్ ఈ చేరికలను ఎన్నికల వరకు కొనసాగించి ఆ రెండు పార్టీల్లోని కీలక నేతలను చేర్చుకోవాలనే ప్లాన్ లో ఉంది.

ఉమ్మడి పాలమూరు జిల్లా పైన ప్రత్యేకంగా కాంగ్రెస్ దృష్టి పెట్టింది.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సొంత జిల్లా కావడంతో ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ,ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చారెడ్డి వంటి వారు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరారు.
ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి అనుచరులు హైదరాబాద్ కు భారీ ఎత్తున తరలి వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.ఇక అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా చేరికలను ప్రోత్సహించి, వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
ఇక బీఆర్ఎస్ లో చేరికలను ప్రోత్సహించే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు , మంత్రులు ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ బిజెపి నాయకులను గుర్తించి వారిని బుజ్జగించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలు ఎక్కువ చేరికలపై దృష్టి సారించి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి.







