సూర్యాపేట జిల్లా: నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వెజ్ &నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపనలకే పరిమితమైందని బహుజన సమాజ్ పార్టీ(Bahujan Samaj Party ) జిల్లా ఇన్చార్జి రాపోల్ నవీన్ కుమార్( Rapaul Naveen Kumar ) అన్నారు.గురువారం పట్టణంలోని జాన్ పహడ్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ సముదాయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించి,మార్కెట్ సముదాయ భవన పునాదులలో బీఎస్పీ బృందంతో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీకృత వాణిజ్య భవన నిర్మాణం ఆగిపోవడానికి కోర్టు కారణమని అబద్ధాలు చెబుతున్నారని,కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరో,నిర్మాణం ఆగిపోవడానికి పరోక్ష కారణం ఎవరో తమకు తెలుసన్నారు.ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ఎస్పి స్థలానికి సంబంధించిన పత్రాలు బలవంతంగా లాక్కెళ్ళింది ఎవరో,ప్రజలందరికీ తెలుసన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో లేదని స్పష్టంగా అర్థమవుతుందని, 2021- 22 ప్రభుత్వ ప్రత్యేక నిధులు అంచనా విలువ 390 లక్షలతో నేరేడుచర్ల ప్రధాన కూడలి జాన్ పహాడ్ రోడ్డు నందు సర్వే నెంబర్ 264 లో ఉన్న ఎన్ఎస్పి క్యాంపు భూమిలో స్థానిక ఎమ్మెల్యే.జిల్లా మంత్రితో పాటు ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2022 లో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్( Integrated Veg ) కీ శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
ఆ సమయంలో అక్కడ ఉన్న షాపులు, ఇండ్లు కలెక్టర్ ఆర్డర్ తో అర్డాంతరంగా కూల్చి వేశారని,అనంతరం కాంట్రాక్టర్ పనులు కూడా ప్రారంభించారని,ఏం జరిగిందో తెల్వదు కానీ,ఆ భూమిపై కోర్టు కేసులు ఉన్నాయని మొదలు పెట్టిన పనులను సైతం వెనక్కు తీసుకొని వెళ్లిపోయారని అన్నారు.
ప్రభుత్వ ఆర్భాటంతో వేసిన శంకుస్థాపన శిలాఫలకం మాత్రమే మిగిలిందని,ప్రస్తుతం నేరడుచర్ల మున్సిపాలిటీ ప్రధాన రోడ్ల వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దీంతో రోడ్ల పక్కన ఉన్న మార్కెట్లు షాపులు కూల్చివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని,వారు మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.సాక్షాత్తు రాష్ట్రమంత్రి,ఒక రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేసిన దానికే దిక్కూమొక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కోట్లకు కోట్లు మంజూరు చేస్తున్నట్టు పత్రికా ప్రకటనలు చేస్తున్నారు తప్ప, అభివృద్ధి ఎక్కడో చూపించాలని సవాల్ విసిరారు.ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సమీకృత మార్కెట్,స్మశాన వాటిక బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి బొల్లాగాని సుబ్బు గౌడ్, ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి,పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పతల నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.