ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )భారీ అనుచర గణంతో ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
సీఎల్పీ నేత మల్లు గట్టు విక్రమార్క పాదయాత్ర నేడు ముగియనున్న నేపథ్యంలో ఈ సభకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) హాజరుకానున్నారు.ఈ సభలోనే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ఈ సభకు లక్షల మంది జనాలు హాజరయ్యే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా ల నుంచి ఈ సభకు జనాలు వచ్చే విధంగా జన సమీకరణ చేపట్టారు.
ఖమ్మం సభను కాంగ్రెస్ తో పాటు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా పార్టీ శ్రేణులో ఉత్సాహం నింపి, తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.

అయితే ఈ సభకు జనాలు రాకుండా ఇబ్బందులు పెట్టే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Party ) వ్యవహరిస్తోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు పైన ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు.ప్రభుత్వం ఈ సభను సక్సెస్ కాకుండా చేసేందుకు అన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తుందని, దాదాపు 1700 వాహనాలను ఇప్పటికి వరకు సీజ్ చేశారని , అన్ని జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఖమ్మం సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారని , పోలీసులు ఆర్టిఏ అధికారులు, వాహనాలను తనిఖీ చేస్తూ సభకు వెళ్లవద్దంటూ డ్రైవర్లను బెదిరిస్తున్నారంటూ పొంగులేటి ఆరోపించారు.

అలాగే ఈ సభలకు వెళ్లే జనాలను బెదిరిస్తున్నారని ,ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని, దళిత బంధు, రేషన్ కార్డులు ఇస్తామని ఆపే ప్రయత్నం చేస్తున్నారని, కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఏజెంట్లుగా మారారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొద్దిసేపట్లోనే రోడ్డు మీదకు వస్తున్నాను… ఎక్కడా వెనక్కి తగ్గవద్దు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకండి.తెలంగాణలో తొలి ఉద్యమం ఖమ్మం నుంచి ప్రారంభం అయ్యింది.
సీఎం కేసీఆర్ పతనం కూడా ఇదే సభ నుంచే ప్రారంభం అవుతుంది అంటూ పొంగులేటి హెచ్చరించారు.







