ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అధికార పార్టీ వైసిపిని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.2019 ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి బిజెపికి దగ్గర అయ్యేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న, బిజెపి రాష్ట్ర నాయకులు నుంచి అగ్ర నేతలు వరకు చంద్రబాబును పట్టించుకోనట్టుగానే వచ్చారు.అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడం, బిజెపి అగ్ర నేతల వైఖరిలో మార్పు వచ్చింది.
ఏపీలో ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా టీడీపీ తో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేసింది.దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు కి బీజేపీ అగ్ర నేతలు అపాయింట్మెంట్ కూడా ఖరారు చేశారు.
దీంతో చంద్రబబు( Chandrababu Naidu ) ఢిల్లీకి వెళ్లి మరీ అమిత్ షా ( Amit Shah ), జేపీ నడ్డాలతో మంతనాలు చేశారు.ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకునే దిశగా బిజెపి, జనసేన, టిడిపిలు ప్రయత్నం చేస్తున్నాయి .
ఇదిలా ఉంటే మొదటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ను సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) మరోసారి చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఏపీ విభజన హామీలపై టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోమ వీర్రాజు ఘాటుగా స్పందించారు.తాను వదిలేస్తే జగన్ అప్పట్లో రాష్ట్రమంతా తిరిగారని చంద్రబాబు అంటున్నారని, అప్పట్లో జగన్ పాదయాత్రలు చేస్తుంటే వదిలేసి ,ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారని వీర్రాజు ఫైర్ అయ్యారు.తన వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయని చంద్రబాబు అనుసరించిన విధానం అభ్యంతరకరం అంటూ వీర్రాజు అన్నారు.
విభజన హామీల విషయంలో చంద్రబాబు వస్తే ఒకే వేదికపై తన అభిప్రాయం చెప్తానని వీర్రాజు అన్నారు.చంద్రబాబు ప్రభుత్వం లో అమిత్ షా కారుపై రాళ్లు వేసినప్పుడు బాబు ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారని వీర్రాజు ప్రశ్నించారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దంటే ఎవరు స్పందించలేదని, ఆయన సభలు అడ్డుకోలేదని వీర్రాజు గుర్తు చేశారు.ఇక రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రంలో చక్రం తిప్పుతాను, ఐదుగురు ప్రధాన మంత్రులను మార్చానని చంద్రబాబు చెబుతారని, మరి రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని వీర్రాజు ప్రశ్నించారు.
ఈ తరహా ప్రశ్నలు తను వద్ద చాలానే ఉన్నాయని, వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.ఒకపక్క టిడిపి, బిజెపి లు పొత్తులు పెట్టుకుని దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండగానే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హోదాలో ఉన్న సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం వంటి వ్యవహారాలు చూస్తుంటే, టిడిపితో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అనే సంకేతాలను వీర్రాజు ఈ విధంగా వ్యక్తం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.