యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి,జనగామ రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపు అంశంపై చర్చించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో గురువారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరమని,భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని,యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందని,యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిందన్నారు.ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారని,ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, అలాగే,భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు,వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు.
జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడిందని,ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ కు రోజూ అనేక మంది విద్యార్థులు,ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారని,ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి,జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అలాగే ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయని,రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదన్నారు.
కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు.సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తన అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని,కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,భువనగిరి, ఎంపీ సీటు జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు.







