అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )కొలువులో మరోసారి భారతీయులకు కీలక పదవులు లభిస్తున్నాయి.గడిచిన కొద్దిరోజులుగా ఆయన పలువురు భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమిస్తున్నారు.
తాజాగా అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కమీషన్ డిప్యూటీ చీఫ్ స్థానానికి భారతీయ అమెరికన్ నిషా దేశాయ్ బిస్వాల్( Nisha Biswal )ను జో బైడెన్ నామినేట్ చేసినట్లు వైట్హౌస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.నిషా బిస్వాల్కు అమెరికా విదేశాంగ విధానం, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, కాంగ్రెస్, ప్రైవేట్ రంగంలోని అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలలో 30 ఏళ్లకు పైగా అనుభవం వుంది.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో దక్షిణ, మధ్య ఆసియాకు సహాయ కార్యదర్శిగా ఆమె పనిచేశారు.నిషా ప్రస్తుతం యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇంటర్నేషనల్ స్ట్రాటజీ, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్ బంగ్లాదేశ్ బిజినెస్ కౌన్సిల్ను పర్యవేక్షిస్తున్నారు.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో 2013 నుంచి 2017 వరకు నిషా బిస్వాల్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సహాయ కార్యదర్శిగా పనిచేశారు.ఈ సమయంలో ఇండో యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆమె పర్యవేక్షించారు.ఇందులో యూఎస్ ఇండియా వార్షిక స్ట్రాటజిక్ అండ్ కమర్షియల్ డైలాగ్ను ప్రారంభించడం కూడా ఒకటి.అలాగే ఆమె అసిస్టెంట్ సెక్రటరీగా వున్న సమయంలో సెంట్రల్ ఆసియాతో సీ51 డైలాగ్, యూఎస్ బంగ్లాదేశ్ పార్ట్నర్షిప్ డైలాగ్లను కూడా నిషా ప్రారంభించారు.
దీనికి ముందు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ)లో ఆసియాకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా.దక్షిణ, మధ్య, ఆగ్నేయాసియా లోని సంస్థ కార్యక్రమాలు, కార్యకలాపాలకు నిషా నేతృత్వం వహించారు.ఇక క్యాపిటల్ హిల్( Capitol Hill )లో దాదాపు పదేళ్ల పాటు పలు హోదాల్లో విధులు నిర్వహించారు.స్టేట్ అండ్ ఫారిన్ ఆపరేషన్స్ సబ్ కమిటీలో స్టాఫ్ డైరెక్టర్గా, ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీలో ప్రొఫెషనల్ స్టాఫ్గానూ పనిచేశారు.
ప్రస్తుతం నేషనల్ డెమొక్రాటిక్ ఇన్స్టిట్యూట్, యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లోనూ ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.