సోషల్ మీడియా వచ్చాక మనుషుల జీవితాలు చాలా చిత్ర విచిత్రంగా తయారయ్యాయి.ప్రజలకు తమ జీవితాల్లోని జరిగిన కొన్ని కొన్ని ముచ్చట్లను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు జనాలకి చూపించాలన్న దురాశ విపరీతంగా పెరిగిపోయింది.
వీటికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు.అవును, సెల్ఫీలు, రీల్స్ పేరుతో కొంతమంది రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలో విచక్షణను సైతం కోల్పోతున్నారు.వీడియో రికార్డులు చేసే యావలో వారు ప్రమాదంలో ఎలాగూ పడతారు.
ఈ క్రమంలో ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి ఘటన ప్రస్తుతం నెట్టంట్లో వైరల్ అవుతోంది.అది ఓ భార్యభర్తలకు సంబంధించిన వీడియో.అందులో ఓ యువకుడు కారు డ్రైవింగ్ చేస్తూనే ఇన్స్టాలో రీల్ తీసేందుకు సిద్ధమయ్యాడు.
అతడు డ్రైవ్ చేస్తున్నది మహింద్రా ఎక్స్యూవీ 700(Mahindra XUV700).డ్రైవింగ్లో ఉండగానే వీడియో రికార్డు చేయడం ఇపుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయింది.సదరు కారులోని ఏడీఏఎస్ (ADAS)వ్యవస్థని మనోడు బాగా వాడుకున్నాడు.డ్రైవింగ్లో సాయపడేందుకు ఈ వ్యవస్థను కారులో ఏర్పాటు చేయడం జరిగింది.యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నప్పుడు ఏడీఏఎస్ వ్యవస్థ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది.

ఇది దిశను మార్చడంతో పాటు ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది.ప్రమాదాల నివారణకు ఎంతో కీలకమైన ఈ వ్యవస్థను ఆ జంట ఇన్స్టా రీల్స్ కోసం దుర్వినియోగం చేయడం బాధాకరం.సదరు జంట స్టీరింగ్ ని ఎంచక్కా గాలికి వదిలేసి చిలిపి తగాదాలు పడుతూ, సరసాలాడుతూ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నారు.
ఇది చాలదన్నట్టు అతడు తన కాళ్లు రెండూ పైకెత్తి తన భార్య సీటుపై కాలు వేయడం కొసమెరుపు.ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు.
ఇలాంటి వాళ్లున్న రోడ్లపై ప్రయాణించాల్సి రావడం మన దురదృష్టం అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.







