తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి చాలా కాలం నుంచి ఉంది.రెండుసార్లు వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూడోసారి ఆ హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే బీజేపీ బలపడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరగకు ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆ హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నారనే హడావుడి చాలాకాలం నుంచి జరుగుతోంది.
దీనికి తగ్గట్లుగానే కేసిఆర్ వ్యవహార శైలి ఉండేది.ఇక ఇటీవల కాలంలోనూ కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి ప్రగతి భవన్ లో అందరికీ అందుబాటులో ఉంటున్నారు.
జిల్లాల వారిగా పర్యటనలు చేస్తూ, సభలు , సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ దూకుడు పెంచారు.
దీంతో ముందస్తు ఎన్నికల కోసమే కేసిఆర్ ఈ హడావుడి పడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.తాజాగా ముందస్తు ఎన్నికల వ్యవహారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.వాస్తవంగా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది.
అయితే అంతకంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.కేసిఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని పైకి చెప్తున్నా, ఆయన మాటలు వెనుక మర్మం ఉంటుందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
ఇక బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది.
పదేపదే ఈ ముందస్తు ఎన్నికల వ్యవహారంపై విపక్షాలు మాట్లాడుతుండడంపై, కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని , కానీ పార్లమెంట్ ను రద్దుచేసి ముందస్తుకు వస్తే తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కేంద్రాన్ని ఈ వ్యవహారంలోకి లాగారు.కేటీఆర్ తామంతట తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని, బిజెపికి దమ్ముంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని రద్దుచేసి వస్తే తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు.