టిఆర్ఎస్ (బీ ఆర్ ఎస్) లో కీలక నేతగా ఎదిగి కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యం దక్కించుకున్న ఈటెల రాజేందర్ కు ఆ తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడం, కెసిఆర్ ఈటెలను దూరం పెడుతూ రావడం, మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయడం వంటివన్నీ జరిగాయి.దీంతో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి హుజురాబాద్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు.
ఇక ఎన్నికల్లో గెలుపుతో రాజేందర్ కు బిజెపి అధిష్టానం బాగానే ప్రాధాన్యం ఇచ్చింది.చేరికల కమిటీ చైర్మన్ గానూ ఆయనకు పదవిని కట్టబెట్టింది.
దీంతో అప్పటి టిఆర్ఎస్ లో కీలక నాయకులందరినీ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని బలహీనం చేస్తారని బిజెపి పెద్దలు భావించిన రాజేందర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత, అంతకుముందు పెద్దగా ఆ పార్టీ నుంచి బిజెపిలోకి చేరికలు కనిపించలేదు.
దీంతో చేరికల కమిటీ చైర్మన్ గా రాజేందర్ విఫలమవుతున్నారంటూ ఢిల్లీ బిజెపి పెద్దలకు తెలంగాణ బిజెపిలోని కొంతమంది నాయకులు ఫిర్యాదులు చేయడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.
దీంతో గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ ఈ వ్యవహారాలపై స్పందిస్తున్నారు.బిజెపిలో చాలామంది కెసిఆర్ కోవర్ట్ లు ఉన్నారంటూ రాజేందర్ బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపారు.దీంతో ఒక్కసారిగా బిజెపిలో గందరగోళం నెలకొంది.
రాజేందర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియక అంతా ఈ విషయమై చర్చించుకుంటూ ఉండగా , ఈ వ్యవహారంలోకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.ఈటెల రాజేందర్ కు బిజెపి లోను సరైన ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన ఆయన, రాజేందర్ ను కాంగ్రెస్ వైపుకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.
దీనిలో భాగంగానే బిజెపిలో ఉంటే కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం నెరవేరదని రాజేందర్ కు సూచిస్తూనే , తమ ఉమ్మడి రాజకీయ శత్రువు అయిన కేసీఆర్ ను ఓడించాలంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందనే సంకేతాలను రేవంత్ రెడ్డి పంపుతున్నారు.అయితే రేవంత్ వ్యాఖ్యలను ఈటెల రాజేందర్ పట్టించుకోకపోయినా, రేవంత్ మాత్రం రాజేందర్ తో పాటు, బిజెపిలోని ఇతర కీలక నాయకులను చేర్చుకుని కాంగ్రెస్ ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా అయితే కనిపిస్తున్నారు.