తెలంగాణ బిజెపిలో భారీ గా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి ముందుకు వెళ్తోంది.
అధికార పార్టీ బిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది.జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతం చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో… తెలంగాణలో ఆ పార్టీని ఓటమి చెందేలా చేయడం ద్వారా కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలనే పట్టుదలతో బిజెపి అధిష్టానం పెద్దలు ఉన్నారట.
దీనిలో భాగంగానే బిజెపి ఇక్కడ గెలిచేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు .
దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపిలో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ముఖ్యంగా ప్రస్తుతం హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ కు , అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రమోషన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట.కెసిఆర్ క్యాబినెట్ లో ఆర్థిక , ఆరోగ్య మంత్రిగా పదవులు చేపట్టిన రాజేందర్ కు మొదటి నుంచి అప్పటి టిఆర్ఎస్ లో అనేక విషయాలు బాగా తెలుసు.
సంస్థగతంగా పార్టీ నిర్మాణం నుంచి ఈటెల రాజేందర్ పనిచేస్తూ ఉండడంతో పాటు, ఇప్పటికీ ఆ పార్టీ నేతలు అందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం , రాష్ట్రవ్యాప్తంగా జనాలకు సుపరిచితమైన వ్యక్తి కావడం తదితర అంశాలను అన్నిటిని పరిగణలోకి తీసుకుని రాజేందర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని కట్టబెడితే బాగుంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉందట.

ప్రస్తుత తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పని తీరు పై అధిష్టానానికి ఎటువంటి సందేహాలు లేవు.ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ మరింతగా బలోపేతం అయింది.ఇప్పుడు టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది.
అంటే దానికి సంజయ్ పనితీరే కారణమని అధిష్టానం పెద్దలు ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు.అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాజేందర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవసరమైతే ఆయనను ప్రకటిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయంలో బిజెపి అధిష్టానం ఉందట.
అందుకే త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో బండి సంజయ్ కు కేంద్ర క్యాబినెట్ హోదాతో మంత్రి పదవిని ఇచ్చే ఆలోచనలో ఉందట
.






