వైసిపి కీలక నేత ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డికి ఓ పెద్ద డౌట్ వచ్చింది.అది కూడా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై.
వెంటనే ఆ డౌట్ ను తీర్చుకునే ఉద్దేశంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సజ్జల మీడియా ద్వారా ప్రశ్నించారు. టిడిపి ది రాజకీయ పార్టీనా లేక మార్కెటింగ్ ఏజెన్సీనా అనేది స్పష్టం చేయాలంటూ సజ్జల నిలదీశారు.
ఇటీవల ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, తెలంగాణ అంతట టిడిపిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం పైన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు.తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడ టిడిపి మనుషులను చూపి పొత్తు పెట్టుకోవాలని, తాను పంపిన స్లీపర్ సెల్స్ ద్వారా బిజెపి అధిష్టానానికి చెప్పించడానికి చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టారని సజ్జల సెటైర్లు వేశారు.
తెలంగాణలో బిజెపితో పొత్తు కుదిరితే ఏపీలోనూ పొత్తుకు మార్గం ఏర్పడుతుందని చంద్రబాబు ఈ విధంగా తంటాలు పడుతున్నారని సజ్జల విమర్శలు చేస్తున్నారు .
చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయం చేశారని , ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయి, రాత్రికి రాత్రి పారిపోయి కరకట్టలోని అక్రమ కట్టడంలోకి చేరుకున్నారని ఎద్దేవా చేశారు.బాబుకు హైదరాబాద్ లోనే ఇల్లు ఉందని, మొన్నటి వరకు ఓటు కూడా అక్కడే ఉండేదని , ఈ మధ్యనే రాష్ట్రంలోకి మార్పించుకున్నారని సజ్జల తెలిపారు.రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయం చేయొచ్చు గాని, ఎన్నికలకు ముందు ప్రజలతో ఆటలాడుకోవాలనే తన పాత పద్ధతిని చంద్రబాబు అనుసరిస్తున్నారంటూ మండిపడ్డారు .

రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం అనే లక్షణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని, ఢిల్లీలో చక్రం తిప్పుతానని తెలంగాణలో హడావుడి చేసిన బాబు ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఈ విధంగా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణ కాంగ్రెస్ లోని తన స్లీపర్ సెల్స్ తో పాటు , టిడిపి నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్న చంద్రబాబు, మరి ఏపీలో బిజెపిలోకి ఫిరాయింపు ల ద్వారా పంపిన స్లీపర్ సెల్స్ ను ఎందుకు పార్టీలోకి ఆహ్వానించడం లేదని నిలదీశారు.







