సోషల్ మీడియా పెరగడంతో, స్మార్ట్ ఫోన్ల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుండడంతో ఎలాంటి వార్తైనా క్షణాల్లో యిట్టె వైరల్ అయిపోతుంది.ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
అవును, దాని సారాంశం ఏమనగా….మన దేశంలో మళ్లీ రూ.1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి వచ్చాయని.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది కూడా ఓ వీడియో కంటెంట్ రూపంలో.
కాగా దాని పూర్తి సారాంశం ఏమనగా… రూ.2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాని వలన 2023 జనవరి 1వ తేదీ నుంచి రూ.1000 నోట్లు చెలామణిలోకి రానున్నాయన్నది ఆ వీడియో సారాంశం.అయితే 2019 తర్వాత నుంచి రూ.2000 కరెన్సీ నోట్ల ముద్రణకు కొత్త ఇండెంట్ ఏదీ పెట్టలేదని కేంద్రం ప్రకటించిన తర్వాత ఈ వీడియో బయటకు రావడం కొసమెరుపు.అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.

ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేసింది.అసత్య ప్రచారం చేస్తున్నారని , వీటిని ప్రజలు ఎట్టిపరిస్థితులలో నమ్మవద్దని హెచ్చరించింది.అలాగే అటువంటి మెసేజ్లను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వార్డ్ చేయవద్దని కూడా ప్రజలకు ఈ సందర్భంగా సూచించింది.ఈ నేపథ్యంలో రూ.2000 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ ట్వీట్ చేసింది.కాగా రూ.2000 నోట్లను దశల వారీగా ఉపసంహరించాలన్న డిమాండు ఇటీవల రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చిన సంగతి విదితమే.కాగా రూ.2000 నోట్లు దాచుకున్న ప్రజలు వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రెండేళ్లు వ్యవధి ఇవ్వాలని బిజెపి ఎంపి సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.







