ప్రవాస భారతీయుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 16న ‘NRI Punjabian naal Milni’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ స్వయంగా ప్రవాస భారతీయులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించనున్నారు.
జలంధర్ సహా వివిధ జిల్లాల్లో ఎన్ఆర్ఐలతో ఐదు మిల్నీలు (సమావేశాలు) జరుగుతాయి.ఈ మేరకు జలంధర్ డివిజన్ కమీషనర్, ఎన్ఆర్ఐ సభ ఛైర్మన్ గుర్ప్రీత్ కౌర్ సప్రా వివరాలు తెలియజేశారు.
జలంధర్- కర్తార్పూర్ జాతీయ రహదారిపై ఎన్ఐటీ సమీపంలోని సెయింట్ సోల్జర్ క్యాంపస్ వేదికగా ఓ సమావేశం జరుగుతుందని గురుప్రీత్ చెప్పారు.ఎన్ఆర్ఐల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు వీలుగా అన్ని శాఖల సీనియర్ అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు.ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్ ఉదయం 10.30 గంటల నుంచి జరుగుతుందని.రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మిల్నీ ప్రక్రియ ప్రారంభమవుతుందని గురుప్రీత్ చెప్పారు.జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్, షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.
పంజాబీ ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు.తద్వారా వారి ఫిర్యాదులను పరిష్కరించుకోవడంతో పాటు విలువైన సూచనలను ఇవ్వొచ్చని గురుప్రీత్ పేర్కొన్నారు.
జలంధర్ తర్వాత తదుపరి మిల్నీ డిసెంబర్ 19న ఎస్ఏఎస్ నగర్ (మొహాలీ)లో , డిసెంబర్ 23న లూథియానా, డిసెంబర్ 26న మోగా, డిసెంబర్ 30న అమృత్సర్లో జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇకపోతే… ప్రవాసులకు సకాలంలో న్యాయం జరిగేలా పంజాబ్లో ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచాలని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ గతవారం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.పంజాబీ ప్రవాసుల సమస్యలు , ఆందోళనలను వారి ఇంటి వద్దే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.పంజాబీ ప్రవాసులకు గ్యాంగ్వార్ ఆందోళన కలిగిస్తోందని.అభద్రతా భావంతో వున్న ఎన్ఆర్ఐలకు ఆయుధాల లైసెన్స్లు మంజూరు చేయాలని సత్నామ్ సింగ్ కోరారు.