తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ కాస్త ఇప్పుడు బి.ఆర్.ఎస్ గా మారిపోయింది.తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే చక్రం తిప్పిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు జాతీయ పార్టీ ఏర్పాటుతో ముందడుగు వేశారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసి బిజెపికి ప్రత్యామ్నాయంగా మారుతామని పదేపదే చెబుతున్నారు.ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు.ఈసీ నుంచి కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు అనుమతులు రావడంతో, పార్టీ జెండాను ఆవిష్కరించారు .ఇక ఒక్కో రాష్ట్రంలో అడుగుపెడుతూ తమ సత్తా చాటేందుకు కెసిఆర్ సిద్ధమైపోతున్నారు.ముందుగా కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను పోటీకి దింపాలని చూస్తున్నారు.
అక్కడ 2023 మే లోపే ఎన్నికలు జరుగుతాయి.
తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో జెడిఎస్ తో కలిసి పోటీ చేయాలని టిఆర్ఎస్ భావిస్తోంది.గుల్బర్గా నుంచి బీదర్ వరకు ఏడు జిల్లాలపై కేసీఆర్ దృష్టి సారించారు.
ఢిల్లీలో ఈనెల 14న టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, జాతీయ రాజకీయాల్లోకి అధికారికంగా కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారు.త్వరలోనే తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో తమకు మిత్రుడుగా ఉన్న జగన్ తోనూ వైరం పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు .ఏపీలో 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ ను పోటీకి దింపేందుకు కేసిఆర్ ఆలోచన చేస్తున్నారు.

దీనిలో భాగంగానే విజయవాడలోని జక్కంపూడి ఎన్ఆర్ రింగు రోడ్డు హైవే సమీపంలో 800 గజాల్లో బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పార్టీ ఆఫీసు నిర్మాణం నిమిత్తం ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడకు టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రానున్నారు.ఇక ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏపీలోనూ పార్టీ కమిటీలను , జిల్లాల అధ్యక్షులు , రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేపట్టి , పూర్తిగా ఏపీ రాజకీయాల పైన బీఆర్ఎస్ ఫోకస్ చేయబోతోంది.ఏపీలో సొంతంగా పోటీ చేస్తారా లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ, ఏపీలోనూ అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో బీఆర్ ఎస్ ముందడుగు వేసేలా కనిపిస్తోంది.