శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ అన్నప్రసాద భవనంలో ఆయుధపూజ నిర్వహించినట్టు టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఉదయం జరిగిన ఆయుధపూజలో ఈవో పాల్గొన్నారు.అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇందులో భాగంగా అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసారు.
అనంతరం టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద భవనంలో సాంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.
దాతల సహకారంతో భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందిస్తూ, ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు.తిరుమలలో 1983 వ సంవత్సరం ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం 2009లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం నిర్మించి రోజుకు దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా భక్తులకు అత్యద్భుతమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి రుచికరమైన భోజనాలు అందిస్తున్నామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.