తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వెళ్లారు.డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీతో ఆమె భేటీ అయ్యారు.
తన పాదయాత్రకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా నర్సంపేటలో జరిగిన దాడి, నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేసినట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పట్టపగలే టీఆర్ఎస్ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్ గూండాల దాడిని సీఎంకు చూపించేందుకు ప్రయత్నిస్తే తనపై కేసు పెట్టారని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులో రిమాండ్ అడగాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.పోలీసులను సైతం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటోందని ఆరోపించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం టీఆర్ఎస్ పార్టీకే వర్తిస్తుందని విమర్శించారు.ఈనెల 4వ తేదీన నర్సంపేటలో ఆగిన ప్రాంతం నుంచే పాదయాత్రను పున : ప్రారంభిస్తామని షర్మిల స్పష్టం చేశారు.