లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.
దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి సునాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో విమర్శలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గడం లేదు.
ప్రస్తుతం ఆయన పనితీరు పట్ల బ్రిటన్ వాసులు సంతోషంగానే వున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత కూడా రిషి సునాక్ పాపులారిటీ మరింత పెరిగిందే కానీ తగ్గలేదు.
అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే రిషికే ప్రజల మద్ధతు ఎక్కువగా వున్నట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి.ఇప్సోస్ పొలిటికల్ మానిటర్ ఈ నెలలో జరిపిన సర్వే ప్రకారం.ఇందులో పాల్గొన్న 47 శాతం మంది రిషికి మద్ధతు పలకగా.41 శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా వున్నారు.
ఇదిలావుండగా.తాను జీవితంలో చూసిన పరిస్ధితులు, తన అనుభవమే తనను ప్రధాని పీఠం వైపుగా నడిపించాయని రిషి సునాక్ అన్నారు.లండన్లో జరిగిన దక్షిణాసియా వంటకాల ‘‘కర్రీ ఆస్కార్స్’’ అవార్డుల వేడుకకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ.
కాలేజీ రోజుల్లో సౌథాంప్టన్లోని ఓ భారతీయ రెస్టారెంట్లో షిఫ్టుల్లో పనిచేశానని, ఈ క్రమంలో తాను చేసిన పని, శిక్షణే ఉన్నత లక్ష్యాల వైపుగా నడిపించాయని అన్నారు.తీవ్రమైన ఒత్తిడిలో వుండగా వంటగాళ్లు, వెయిటర్స్ ఎంత కష్టపడతారో తనకు తెలుసునని రిషి సునాక్ పేర్కొన్నారు.
అసలేంటీ కర్రీ ఆస్కార్స్ :
దక్షిణాసియా వంటకాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు లండన్లో ప్రతి ఏటా ‘‘కర్రీ ఆస్కార్స్’’ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు.గడిచిన 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.ఇక ఈ ఏడాది విషయానికి వస్తే.బెస్ట్ సెంట్రల్ లండన్ రెస్టారెంట్గా బెనారస్, బెస్ట్ న్యూకమర్గా కల్నల్ సాబ్, వాయువ్య ఇంగ్లాండ్లో బెస్ట్ రెస్టారెంట్గా లివర్పూల్లోని మౌగ్లి స్ట్రీట్ఫుడ్లు ఎంపికయ్యాయి.