ఆస్ట్రేలియన్ పౌరురాలిని దారుణంగా చంపిన కేసులో మోస్ట్ వాంటెడ్గా వున్న పంజాబీ వ్యక్తిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే.
పంజాబ్లోని బటర్ కలాన్కు చెందిన రాజ్వీందర్ సింగ్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్లో నివసిస్తూ, అక్కడే నర్సుగా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో 2018లో క్వీన్స్లాండ్లోని వంగెట్టి బీచ్లో తోయా కార్డింగ్లీ అనే యువతిని దారుణంగా హతమార్చాడు.
ఈ ఘటన బీచ్ మర్డర్ పేరిట ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించింది.రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో హత్య చేసింది రాజ్వీందరేనని తేల్చారు.
అయితే అప్పటికే నిందితుడు తన భార్య, ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి భారత్కు పారిపోయి వచ్చాడు.
అప్పటి నుంచి రాజ్వీందర్పై నిఘా పెట్టిన ఆస్ట్రేలియా పోలీసులు… అతను భారత్లో వున్నాడని గుర్తించారు.
ఈ నేపథ్యంలో 2021 మార్చిలో రాజ్వీందర్ను తమకు అప్పగించాలని కోరుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం లేఖ రాసింది.దీనికి ఈ ఏడాది నవంబర్లో భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
దీంతో ఇక్కడి పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు.

అలాగే పంజాబీ, హిందీ తెలిసిన ఐదుగురు పోలీసు అధికారులను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమించింది.వీరు ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ, సీబీఐ అధికారులు, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రాజ్వీందర్ను అరెస్ట్ చేశారు.అంతేకాదు అతనిని పట్టించిన వారికి 5.2 కోట్ల రివార్డ్ ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.ఆ దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డ్.
చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం అతనిని త్వరలోనే ఆస్ట్రేలియాకు తరలించనున్నారు.







