ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో దారుణం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు తాను పనిచేసే డైరీ ఫామ్లోనే హత్యకు గురయ్యాడు.
సెంట్రల్ ఆక్లాండ్కు సమీపంలోని సాండ్రింగ్హామ్లోని రోజ్ కాటేజ్ సూపరెట్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.యజమానులు భారతదేశానికి సెలవుల నిమిత్తం వెళ్లడంతో స్టోర్ ఉద్యోగి డైరీని నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.
మృతుడికి ఇటీవలే వివాహం జరగ్గా.అంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
దీనిలో భాగంగా అతనికి నివాళులు అర్పించేందుకు వందలాది మంది డైరీ వద్ద గుమిగూడారు.
డైరీ అండ్ బిజినెస్ ఓనర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ సన్నీ కౌశల్ మాట్లాడుతూ.
యువకుడి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.అంతేకాకుండా మృతుడి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఆయన గివ్ లిటిల్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
దీనితో పాటు ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కార్యాలయంలోనూ సంతాప సభను నిర్వహించాలని కౌశల్ నిర్ణయించుకున్నారు.మరోవైపు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా ఈ ఘటనను ఖండించారు.
అయితే ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.ఈ ఏరియాలో కమ్యూనిటీ కానిస్టేబుళ్లు లేరని చెబుతున్నారు.గతంలో స్థానిక వ్యాపారులు తలో చేయ్యి వేసి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని భావించారు.అయితే నిధుల కొరత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.
న్యూజిలాండ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనను బట్టి… బుధవారం రాత్రి 8:05 గంటల సమయంలో ఓ వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి కత్తితో బెదిరించి క్యాష్ రిజిస్టర్ తీసుకున్నాడు.
అనంతరం దుండగుడి దాడిలో తీవ్రగాయాలు కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్కాట్ బార్డ్ వెల్లడించారు.ఇదే సమయంలో అనుమానితుడి గుర్తులను పోలీసులు విడుదల చేశారు.
అలాగే ఘటన జరగడానికి ముందు ఎవరైనా నిందితుడిని చూస్తే తమకు సమాచారం అందించాలని పోలీస్ శాఖ పౌరులను కోరింది.