యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేయడానికి విధివిధానాలు రూపొందించి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ లబ్ధిదారుల ఖాతాల్లో వేసి,ప్రీజింగు చేయడాన్ని వెంటనే ఎత్తివేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల,కురుమలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను,అవినీతిని నివారించడానికి నగదు బదిలీని ప్రకటించడాన్ని జిఎంపిఎస్ స్వాగతిస్తున్నదని,అదే సమయంలో కేవలం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు జమ చేసి వెంటనే ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల గొల్ల కురుమలు తమ సొంత డబ్బులను కూడా తీసుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు.డీడీలు కట్టిన కొంతమంది లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదని,దీంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారన్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.ఎన్నికల కోడ్ తొలగించి దాదాపు నెల రోజులు కావస్తుంది.
కావున వెంటనే ప్రీజింగ్ ను ఎత్తివేసి విధివిధానాలు రూపొందించి,రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి లబ్ధిదారులందరి ఖాతాలో నగదు బదిలీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దయ్యాల నర్సింహ్మ,ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,మద్దెపురం బాలనర్సయ్య,సహాయ కార్యదర్శులు ఎల్లముల సత్యనారాయణ,జోగు శ్రీను,బుగ్గ చంద్రమౌళి, జిల్లా కమిటీ సభ్యులు పాక జహాంగీర్,నాయకులు బుడుమ మల్లేష్ పాల్గొన్నారు.







