పాడేరు, నవంబర్ 12:- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు మండలం జామి గూడ, పెదబయలు మండలం బూసిపుట్టు పంచాయతీలలో గల పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు.ముంచింగి పుట్టు ప్రధాన కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు అనుమతి లేని యాప్లతో రైతులను రిజిస్ట్రేషన్ చేయడం గమనించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్సైను ఆదేశించారు.
అదేవిధంగా ఏపీజీవీబీ, స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉండటం లేదని, ఏపీజీవీబీ కరస్పాండెంట్ ద్వారా నగదు తీసుకోవటానికి సర్వీస్ చార్జీల కన్నా అధికంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు పై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ఆయా బ్యాంకుల మేనేజర్లకు ఫిర్యాదు చేయడంతో పాటు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.అనుమతులేని ఏజెంట్ ఆధార్ అప్డేషన్ కరెక్షన్ తదితర పనులు చేయటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తపరుస్తూ ఆయనపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ముంచింగి పుట్ట నుంచి బూసి పుట్టు చేరుకున్న కలెక్టర్ 104 వాహనం ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 104 వాహనం తిరిగే షెడ్యూల్ను ముందుగానే గ్రామస్తులకు తెలియజేయాలని సూచించారు.
అవసరమైన ప్రతి ఒక్కరికి స్కానింగ్ చేయాలని ఆదేశించారు.గ్రామంలో గర్భిణీలు స్కానింగ్ అవసరమైతే ముంచింగి పుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించాలని అవసరమైన ఎక్విప్మెంట్ తో పాటు శిక్షణ పొందిన డాక్టర్ ఉన్నారని వారి సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
జామి గూడా గ్రామం సందర్శించిన కలెక్టర్ పి ఐ యు ద్వారా 220 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కొజ్జారిగూడ, జాడి గూడ, గుంజువాడ, తారకి, జామి గూడ, పిన రావిల్లి, మొదలగు ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు వారానికి ఒక్కరోజే వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారని ఆయా గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం ఈ ఓ, ఏ టి డబ్ల్యూ ఓ లు సోమవారం వ్యక్తిగతంగా కలవాలని ఆదేశించారు.
వారిపై తగు చర్యలకు ఉపక్రమించారు.అదేవిధంగా కొజ్జారిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మనబడి నాడు నేడు ఫేజ్ 1 క్రింద 18 లక్షల రూపాయలు మంజూరు కాగా ఎటువంటి పనులు చేపట్టలేదని సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని దానిపై పూర్తి నివేదిక అందజేయాల్సిందిగా ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ ని ఆదేశించారు.
కొజ్జారిగూడ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్టోబర్ నెలకు సరపరా అయిన పాలు గుడ్లు ఇతర రేషన్ అర్హుల ఇంటికి అందించాలని, నవంబర్ నెల కోటను కూడా వారి వారి ఇండ్లకు అందించాలని ఆదేశించారు.
జామి గూడ పంచాయతీ పరిధిలో గల 14 గ్రామాల్లో 11 గ్రామాలకు 56 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద నీటి సరఫరా పనులు మంజూరయ్యాయని, అందులో మిగిలిన నిధులతో మిగిలిన మూడు గ్రామాలకు నీటి సరఫరా పథకాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
గ్రామ పర్యటనల భాగంగా ఒక ఇంటి బయట ఉన్న వంతల బొజ్జయ్య దీనమైన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కలెక్టర్ అతనికి కావలసిన సహాయం అందించాలని ఆదేశించారు.బూసి పుట్టు గ్రామ సచివాలయ భవనం కాంట్రాక్టర్ రాజు ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సదరు కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు, అతనికి అప్పగించిన మిగిలిన కాంట్రాక్టులను కూడా రద్దుచేసి వేరొక కాంట్రాక్టర్ తో పూర్తి చేయించాలని ఆదేశించారు.
జామి గూడ నుంచి ఆంధ్ర ఒడిశా బోర్డర్ వరకు సరైన రహదారి సౌకర్యం లేనందున మేర కొంత దూరం జీపులో కొంత దూరం సర్పంచ్ తో ద్విచక్ర వాహనంపై ప్రయాణించి రోడ్డు పరిస్థితిపై ఆరా తీశారు.ఈ పర్యటనలో సర్పంచ్, ఎంపీటీసీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు
.